MLA Adi Srinivas: గల్ఫ్లో ఉద్యోగం కావాలా.. పంపిస్తాం..! అంటూ ఏకంగా ఎమ్మెల్యేకే కాల్ చేశారు ఏజెంట్స్. తాను ఎమ్మెల్యేనని చెప్పినా వినకుండా బేరసారాలు చేశారు. జగిత్యాలకు చెందిన నవీన్.. లక్ష్మి ట్రావెల్స్ పేరుతో ఏజెన్సీ నడుపుతున్నాడు. గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ.. యువతీ, యువకులకు కాల్ చేసి ఎట్రాక్ట్ చేస్తున్నాడు. అలాంటి కాల్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వచ్చింది. ఫలానా ఏజెన్సీ నుంచి ఫోన్ చేస్తున్నామంటూ మహిళ కాల్ చేసింది. గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ జాబ్ ఆఫర్ ఇచ్చింది. తాను ఎమ్మెల్యేనని చెప్పినా విన్పించుకోలేదు. దాంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. గల్ఫ్ ఏజెంట్ నవీన్ను అరెస్ట్ చేశారు.
గల్ఫ్లో మంచి జాబ్ ఉంది. నెలకు లక్షకు పైగా జీతం వస్తుంది. ఇటువంటి మాటలతో ఎన్నో మంది నిరుద్యోగ యువతులను ఆకర్షిస్తున్న దౌర్భాగ్యకరమైన ట్రెండ్ ఇది. ఎన్నో ఆశలతో, అప్పులు చేసి, మోసపోతున్న కుటుంబాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది.
పొట్టకూటి కోసం, ఉపాధి దొరికితే కుటుంబానికి అండగా ఉండొచ్చనే ఆశ వారందరిదీ. అందుకు పుట్టిన ప్రాంతాన్ని, తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికైనా.. మనసు చంపుకొని సిద్ధం అవుతారు వారంతా. అయితే ఇలా ఎన్నో ఆశలతో గల్ఫ్ దేశాల బాట పడుతున్న వారి పరిస్థితి రోజురోజుకి దయనీయంగా మారుతోంది. ఉపాధి వేటలో ఊరొదిలి వెళ్లిన వారిలో పలువురు కార్మికులు, ఉద్యోగులుగా స్థిరపడగా.. చాలా మంది నకిలీ వీసాలతో మోసాలకు గురవుతున్నారు. అమాయకుల ఆశను ఆసరాగా చేసుకుంటున్న పలువురు ఏజెంట్లు అవతారమెత్తి వీసాల పేరిట నిలువునా ముంచెత్తుతున్నారు.
స్వదేశంలో ఉపాధి కరువై అప్పులు చేసి ఎడారి దేశాల బాట పట్టిన వలస జీవుల పరిస్థితి దయనీయంగా మారుతోంది. ప్రధానంగా నకిలీ ఏజెంట్లు ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లాలని భావిస్తున్న వారిని నిలువునా ముంచుతున్నారు. వీరిని నమ్మి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తోన్న బాధితులు.. కొద్ది రోజులకు మోసాన్ని గ్రహించి లబోదిబోంటున్నారు.
Also Read: తుస్సుమన్న కారు పార్టీ.. సభ తెచ్చిన చిచ్చు.. ఉద్యమ నేతలు వర్సెస్ వలస నేతలు
రాష్ట్రంలో ఎక్కువగా పలు జిల్లాల నుంచి యువత.. ఉపాధి పనుల కోసం గల్ఫ్ దేశాల బాటపడుతుంటారు. దీనిని అదునుగా భావించి నకిలీ ఏజెంట్లు పెద్ద ఎత్తున పుట్టుకొస్తున్నారు. లైసెన్స్లేకున్నా అమాయకుల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ మోసాలకు తెగబడుతున్నారు. ఇక తాజాగా గల్ఫ్కి పంపిస్తామని ఎమ్మెల్యేని నమ్మించింది ఓక కిలేడీ. దీంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ట్రావెల్స్ దందా వెలుగు చూసింది. వేముల వాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, లక్ష్మీ గల్ఫ్ ట్రావెల్స్ నిర్వాహకుడు నవీన్ను అరెస్ట్ చేశారు పోలీసులు.