Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కార్యాలయం ఎదుట ఇటీవల జరిగిన సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ పలువురు యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు హ్యూమన్ రైట్స్ కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేశారు. మల్లన్న కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడిన సాయి ఈశ్వరాచారి మరణంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని, ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను బహిర్గతం చేయాలని వారు కోరారు.
యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు హెచ్ఆర్సీకి సమర్పించిన ఫిర్యాదులో సాయి ఈశ్వరాచారి మరణాన్ని కేవలం వ్యక్తిగత అంశంగా కాకుండా, మల్లన్న ఈ విషయాన్ని బీసీ ఉద్యమానికి ముడిపెట్టి చూపుతున్న తీరును విచారణ చేయాలని కోరారు. ఈశ్వరాచారి మృతికి గల కారణాలపై నిజానిజాలు తెలుసుకునేందుకు తీన్మార్ మల్లన్న కార్యాలయం లోపలికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను తక్షణమే బయటపెట్టాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ చేపట్టాలని ఫిర్యాదుదారులు హెచ్ఆర్సీని కోరారు. సాయి ఈశ్వరాచారి మరణంపై వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లపై మల్లన్న తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని వారు ఆరోపించారు. మల్లన్న చర్యల వల్ల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధుల పరువు, వృత్తి గౌరవం దెబ్బతింటున్నాయని.. తమపై తప్పుడు ఆరోపణలు, ఫిర్యాదులతో వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మల్లన్న తన అధికారాన్ని, మీడియా పలుకుబడిని ఉపయోగించుకుని నిజాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కావున హెచ్ఆర్సీ జోక్యం చేసుకుని ఈ విషయంలో పారదర్శక విచారణ జరిగేలా చూడాలని యూట్యూబ్ ఛానళ్ల ప్రతినిధులు అభ్యర్థించారు. సాయి ఈశ్వరాచారి మరణం వెనుక ఉన్న కారణాలు, మల్లన్న పాత్రపై సమగ్ర దర్యాప్తు చేయాలని, అలాగే తమపై జరుగుతున్న తప్పుడు ఫిర్యాదుల విషయంలోనూ తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.