South Central Railway Cancels 15 Trains: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ట్రాక్ మెయింటెనెన్స్ పనులు, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మొత్తం మీద సుమారు 15 రైళ్లను క్యాన్సిల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ రద్దుతో ప్రతి రోజూ ఈ రైళ్లపై ఆధారపడే వేలాది మంది ప్రయాణికులకు అసౌకర్యం కలగనుంది.
ప్రత్యేకంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నడిచే లోకల్ రైళ్లు ఎక్కువగా రద్దయ్యాయి. ముఖ్యంగా MEMU, DEMU లాంటి రోజువారీ ప్రయాణాలకు ఉపయోగపడే రైళ్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఉద్యోగాలు, విద్య, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ ప్రయాణించే వారికి ఈ రద్దు కొంత ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. విజయవాడ, విశాఖపట్నం, కాచిగూడ, గుంటూరు, సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో ట్రాక్ మరమ్మతులు అత్యవసరంగా ఉండటంతో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ చర్యలు చేపట్టామని అధికారులు స్పష్టం చేశారు.
కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేయగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఇంకొన్ని రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు కూడా చేశారు. అందువల్ల ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు రైళ్ల తాజా సమాచారం ముందుగా తెలుసుకోవాలని అధికారులు సూచించారు.
రద్దైన రైళ్లలో విజయవాడ – విశాఖపట్నం (07466/07467) రైలు, కాకినాడ పోర్ట్ – విశాఖపట్నం (07456/07457) రైలు, విజయవాడ – తెనాలి (07282/07279) రైలు, విజయవాడ – ఒంగోలు (07278/07476) రైలు, గుంటూరు – తెనాలి ( 07575/07440) లాంటి రైళ్లు ఉన్నాయి. అలాగే, విశాఖపట్నం – మచిలీపట్నం (17220), మచిలీపట్నం – విశాఖపట్నం (17219) రైళ్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: ట్రైన్ ఫుడ్ తింటున్నారా? ఈ వీడియో చూసాక జీవితంలో ఆ ఆలోచన రాదు!
ఈ రైళ్ల రద్దు ఏప్రిల్ 12, 2026 వరకు కొనసాగుతుంది. అప్పటి వరకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రయాణానికి ముందు రైల్వే ఎంక్వయిరీ సేవలు, NTES యాప్ ద్వారా రైళ్ల స్టేటస్ తెలుసుకోవడం మంచిదన్నారు. అధికారిక రైల్వే వెబ్సైట్ లోనూ పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుందన్నారు. ముందుగానే సమాచారం తెలుసుకుంటే స్టేషన్ వద్ద ఇబ్బందులు పడే అవకాశం తప్పుతుందన్నారు. ఈ రద్దులు కొంత అసౌకర్యం కలిగించినా, ప్రయాణికుల భద్రత దృష్ట్యా అవసరమైన చర్యలుగా రైల్వేశాఖ వెల్లడించింది.
Read Also: పురుగులు అయిపోయాయ్.. ఇప్పుడేమో ‘అవి’.. వందే భారత్ ఫుడ్లో ఏంటీ చెత్త?