ఇండియా నుంచి నేపాల్ కు మళ్లీ విమాన సర్వీసులు మొదలయ్యాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు తమ సర్వీసులను నడుపుతుననాయి. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో నేపాల్ లో చిక్కుకున్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఈ విమాన సర్వీసులు ఉపయోగపడుతున్నాయి. ఖాట్మండులో భారీ నిరసనలతో భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా మూసివేయబడిన త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయం తిరిగి తెరవడంతో భారత్ నుంచి పలు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిర్ ఇండియా నిన్నటి(సెప్టెంబర్ 11) నుంచి తన సాధారణ సేవలను తిరిగి ప్రారంభించడంతో పాటు ఇండిగో నాలుగు రోజువారీ విమానాలను నడుపుతున్నాయి.
నేపాల్ లో ఉద్రిక్త పరిస్థితులు అదుపులోకి వస్తున్న నేపథ్యంలో విమాన సేవలు మొదలయ్యాయి. దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థలైన ఎయిర్ ఇండియా, ఇండిగో రెండూ సెప్టెంబర్ 11 నుంచ ఖాట్మండుకు షెడ్యూల్ చేసిన విమానాలను తిరిగి ప్రారంభించాయి. నేపాల్లో భద్రతా సమస్యల కారణంగా ఈ విమానాలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. కానీ, ఇప్పుడు కార్యకలాపాలు పూర్తిగా పునరుద్ధరించబడుతున్నాయి.
సుమారు మూడు రోజుల పాటు నేపాల్ లో యువత అక్కడి ప్రభుత్వంపై తిరగబడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఆ దేశ ప్రధాని, మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల ఇళ్లు, కార్యాలయాలను తగలబెట్టారు. మాజీ ప్రధాని భార్య మంటల్లో చిక్కి చనిపోయారు. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు ప్రాణాలను కాపాడుకునేందుకు పారిపోయారు. ఆర్మీ హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్నారు. పెరుగుతున్న భద్రతా సమస్యలకు ప్రతిస్పందనగా, నేపాల్ అధికారులు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని అంతర్జాతీయ విమానాలను నిలిపివేశారు. ఆ తర్వాత నేపాల్ సైన్యం పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగింది. అల్లర్లకు పాల్పడినా, ఆస్తులు ధ్వంసం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో నిరసనకారులు వెనక్కి తగ్గారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోకి రావడంతో భారత్ నుంచి విమాన సర్వీసులు మళ్లీ ప్రారంభం అయ్యాయి.
విమాన సర్వీసుల రద్దు తర్వాత నేపాల్ లో చిక్కుకు పోయిన భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు ఎయిర్ ఇండియా ముందుకు వచ్చింది. సెప్టెంబర్ 10, 11 తేదీల్లో ఢిల్లీ-ఖాట్మండు మధ్య ప్రత్యేక రిలీఫ్ ప్లైట్స్ ను నడిపించింది. సెప్టెంబర్ 11 నుంచి ఖాట్మండుకు తన సాధారణ షెడ్యూల్ విమానాలను తిరిగి ప్రారంభించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. అటు ఇండిగో కూడా నేపాల్ కు తన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 11 నుంచి నాలుగు రోజువారీ షెడ్యూల్ చేసిన విమానాలను నడుపుతున్నట్లు తెలిపింది. ఈ విమానాలు తగ్గింపు ఛార్జీలకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. నేపాల్ లో చిక్కుకుపోయిన ప్రయాణికులు భారతదేశానికి తిరిగి రావడానికి సహాయపడటానికి వీటిని ప్రత్యేకంగా నడుపుతున్నట్లు వెల్లడించింది.
Read Also: ఆరేళ్ల తర్వాత మళ్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ఎంట్రీ, ఏ రూట్ లో అందుబాటులోకి వస్తుందంటే?