ఇండియన్ రైల్వే తన నెట్ వర్క్ లోకి మరో కొత్త రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశపెట్టబోతోంది. సుమారు 6 ఏళ్ల గ్యాప్ తర్వాత మరో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు అందుబాటులోకి రాబోతోంది. చివరి సారిగా రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు 2019లో ముంబై CSMT- ఢిల్లీ మధ్య ప్రారంభించారు.
ప్రస్తుతం దేశంలో 25 రాజధాని ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఆయా రాష్ట్ర రాజధానులను దేశ రాజధానితో అనుసంధానించబోతున్నాయి. ఇక కొత్తగా ప్రారంభం కాబోతున్న రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు మిజోరం రాజధాని సైరంగ్ (ఐజ్వాల్)- ఆనంద్ విహార్ టెర్మినల్ (ఢిల్లీ) మధ్య నడుస్తుంది. ఇది దేశంలో 26వ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు అవుతుంది.
సైరంగ్- ఆనంద్ విహార్ టెర్మినల్ (ANVT) మధ్య ఈ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు వారానికి మూడుసార్లు నడుస్తుంది. ఇది మిజోరాం, ఢిల్లీ మధ్య తొలి రైల్వే సర్వీసుగా గుర్తింపు తెచ్చుకోనుంది. సైరంగ్-ఆనంద్ విహార్ రాజధాని ఎక్స్ ప్రెస్ 44 గంటల్లోపు 2500 కి.మీ దూరాన్ని కవర్ చేస్తుందని అధికారులు వెల్లడించారు. ఈ రైలును సెప్టెంబర్ 13న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభిస్తారు. బైరాబి-సైరంగ్ రైల్వే లైన్ ప్రారంభంతో ఐజ్వాల్-ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ ప్రారంభం సాధ్యం కానుంది. శనివారం (సెప్టెంబర్ 13) 51.38 కి.మీ. మార్గాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
సుమారు రూ. 8,000 కోట్ల వ్యయంతో నిర్మించబడిన 51.38 కి.మీ పొడవైన బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్ ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇందులో 48 సొరంగాలు, 55 ప్రధాన వంతెనలు, 87 చిన్న వంతెనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులోని సొరంగాల మొత్తం పొడవు 12,853 మీటర్లు. వంతెన నంబర్ 196 ఎత్తు 104 మీటర్లు కావడం విశేషం. ఇది ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే 42 మీటర్లు ఎక్కువ. కొత్తగా నిర్మించిన రైలు మార్గంలో ప్యాసింజర్ రైళ్లు గంటకు 100 కి.మీ వేగంతో నడుస్తాయి.
Read Also: వందేభారత్, అమృత్ భారత్ సహా 4 కొత్త రైళ్లు.. ప్రధాని మోడీ చేతలు మీదుగా ప్రారంభం!
దేశంలోని మొట్టమొదటి రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును 1969లో న్యూఢిల్లీ- హౌరా మధ్య ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధానులను జాతీయ రాజధానికి అనుసంధానించే లక్ష్యంతో రాజధాని ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. 50 సంవత్సరాలకు పైగా సేవలందించిన తర్వాత కూడా, రాజధాని ఎక్స్ ప్రెస్ను భారత రైల్వే నెట్ వర్క్ లోని ప్రీమియం రైళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణం చేసేందుకు ఎక్కువగా మొగ్గుచూపడం విశేషం.
Read Also: ప్రయాణీకులకు గుడ్ న్యూస్, ఇక ఆ రైళ్లూ మల్కాజ్ గిరిలో ఆగుతాయట!