BTCS for Future Bullet Trains: దేశంలో భవిష్యత్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులను మరింత అత్యాధునికంగా, తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకురావడానికి భారతీయ రైల్వే కీలక అడుగు వేస్తోంది. ఇందుకోసం భారత్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (BTCS) అనే స్వదేశీ హై స్పీడ్ రైలు సిగ్నలింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ–వారణాసి లాంటి రాబోయే బుల్లెట్ రైలు కారిడార్లలో ఈ టెక్నాలజీని ఉపయోగించాలని టార్గెట్ గా పెట్టుకుంది.
ప్రస్తుతం ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో విదేశీ సిగ్నలింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. భవిష్యత్ ప్రాజెక్టుల్లో విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా, దేశీయంగా రూపొందించిన వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే భారత వాతావరణ పరిస్థితులు, స్థానిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని BTCSను డెవలప్ చేస్తున్నారు. భారత్ అభివృద్ధి చేస్తున్న BTCSను గంటకు 350 కిలోమీటర్ల వరకు వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైళ్లను సురక్షితంగా నిర్వహించేలా అభివృద్ధి చేస్తున్నారు. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలతో అనుసంధానం అయ్యేలా రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
దేశంలో కొత్తగా ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు కారిడార్లకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వచ్చే ఏడాది మధ్య నాటికి ఈ మార్గాల డిజైన్లు, ఇతర సాంకేతిక వివరాలు ఖరారు అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల్లో BTCS కీలక పాత్ర పోషించనుంది. స్వదేశీ టెక్నాలజీ వినియోగం వల్ల బుల్లెట్ రైలు ప్రాజెక్టుల ఖర్చు తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, భారతీయ రైల్వే పరికరాల తయారీ సంస్థలకు కొత్త అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. స్థానిక కంపెనీలు ఈ రంగంలో మరింత అభివృద్ధి చెందడంతో పాటు భవిష్యత్లో విదేశాలకు కూడా ఈ సాంకేతికతను ఎగుమతి చేసే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
Read Also: భూకంపం వచ్చినా భయంలేదు.. మన బుల్లెట్ రైలుకు సూపర్ సేఫ్టీ షీల్డ్!
ప్రస్తుతం ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టులో యూరోపియన్ ట్రైన్ కంట్రోల్ సిస్టమ్ (ETCS) లెవెల్-2ను ఉపయోగిస్తున్నారు. అలాగే ఢిల్లీ–మీరట్ నమో భారత్ కారిడార్ లో కూడా ఇదే తరహా విదేశీ సిగ్నలింగ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇప్పుడు వాటికి ప్రత్యామ్నాయంగా పూర్తిగా భారతీయ సాంకేతికతను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు.
స్వదేశీ BTCS అమలులోకి వస్తే.. విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో పాటు ప్రాజెక్టుల అమలు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ముందుగా పలు దశల్లో పరీక్షలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా దేశంలో హై స్పీడ్ రైలు వ్యవస్థను మరింత బలోపేతం చేయడంలో BTCS కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: చైనా రైలు టికెట్ ధరలు చూస్తే, ఇండియన్ రైల్వేకు సెల్యూట్ చేయడం పక్కా.. ఎందుకంటే!