15 Railway Stations Redevelopment: దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు భారతీయ రైల్వే చర్యలు చేపడుతోంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు స్టేషన్లలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు పలు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ (PPP) విధానంలో పునరాభివృద్ధి చేయడానికి 15 రైల్వే స్టేషన్లను గుర్తించింది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. రాజ్యసభలో తాజాగా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన మంత్రి.. దేశంలోని రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం ప్రభుత్వం పలు విధానాలను పరిశీలిస్తోందని చెప్పారు. వాటిలో PPP మోడల్ కూడా ఒకటని వివరించారు. PPP విధానంలో స్టేషన్ అభివృద్ధికి ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వాములుగా ఉంటాయి. ఈ విధానం ద్వారా ఆధునిక సౌకర్యాలు, మెరుగైన సేవలు, ఇతర మౌలిక వసతులను అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది.
PPP మోడల్ లో పునరాభివృద్ధి చేయనున్న స్టేషన్లలో ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ స్టేషన్ను PPP విధానంలో అభివృద్ధి చేసే ప్రతిపాదనకు పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అప్రైజల్ కమిటీ (PPPAC) ఇప్పటికే ఆమోదం తెలిపింది. అనంతరం ప్రాజెక్టు కోసం బిడ్లను ఆహ్వానించారు. అయితే, తొలిసారి టెండర్ ప్రక్రియలో ఒక్క సంస్థ కూడా బిడ్ దాఖలు చేయలేదు. దీంతో రైల్వే శాఖ మరోసారి టెండర్లను ఆహ్వానించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. మిగిలిన 14 స్టేషన్లు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని మంత్రి చెప్పారు. కొన్ని స్టేషన్లకు మాస్టర్ ప్లానింగ్ జరుగుతుండగా, మరికొన్ని ప్రాజెక్టులకు ఫైనాన్షియల్ మోడలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. అంటే, అన్ని స్టేషన్ల అభివృద్ధి పనులు ఒకేసారి ప్రారంభం కాకుండా, ఒక్కో ప్రాజెక్టును దాని ప్రణాళిక, ఆర్థిక సాధ్యతను బట్టి ముందుకు తీసుకెళ్లనున్నారు.
PPP మోడల్లో స్టేషన్ ఆస్తులను ఉపయోగించుకుని ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశం ఉందా? అనే ప్రశ్నకు కూడా మంత్రి వైష్ణవ్ సమాధానం ఇచ్చారు. ఎంపీ దిలీప్ కుమార్ రాయ్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, స్టేషన్ పునరాభివృద్ధికి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వివరాలను వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ను ఈ మోడల్లోనే ఆధునీకరించారు. ఆధునిక డిజైన్, ప్రయాణికుల సౌకర్యాలు, మెరుగైన మౌలిక వసతులతో ఈ స్టేషన్ ను అభివృద్ధి చేశారు. ఇలాంటి మోడల్ను మరిన్ని స్టేషన్లకు విస్తరించేందుకు రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.
PPP మోడల్తో పాటు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కూడా కొనసాగుతోంది. ఈ పథకం కింద మొత్తం 1,340 స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి గుర్తించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ప్రధానంగా స్టేషన్లకు మాస్టర్ ప్లాన్ రూపొందించడం, ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దశలవారీగా సౌకర్యాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఎంట్రీ, ఎగ్జిట్ మార్గాలు, వెయిటింగ్ ఏరియాలు, ప్లాట్ ఫారాలు, పార్కింగ్, ప్రయాణికుల సౌకర్యాలు లాంటి అంశాలను మెరుగుపరచనున్నారు. ఇప్పటివరకు ABSS కింద 261 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది. మిగిలిన స్టేషన్ల అభివృద్ధి పనులు కూడా దశలవారీగా కొనసాగుతున్నాయి.
Read Also: కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్ మళ్లీ ప్రారంభం.. టికెట్ ధర జస్ట్ 50 రూపాయలే!