First Electric Train in India: భారతీయ రైల్వే అత్యంత పురాతనమైనది. సుమారు 150 ఏళ్లకు పైగా చరిత్రను కలిగి ఉంది. నెమ్మదిగా ఇండియన్ రైల్వేలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆ మార్పుల్లో ఒక ముఖ్యమైన మైలురాయి విద్యుత్ రైళ్ల ప్రారంభం. ఈ రైళ్లు దేశ రవాణా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. కానీ, భారత్ లో తొలి విద్యుత్ రైలు ఎప్పుడు ప్రారంభం అయ్యిందో చాలా మందికి తెలియదు. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారత్ లో తొలిసారి 1925 ఫిబ్రవరి 3న తొలి విద్యుత్ రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఈ రైలు బొంబాయిలోని విక్టోరియా టెర్మినస్ స్టేషన్ నుంచి కుర్లా హార్బర్ వరకు నడిచింది. ఈ ప్రారంభం ఆ కాలంలో చాలా పెద్ద సాంకేతిక విప్లవంగా గుర్తింపు తెచ్చుకుంది. ఎందుకంటే, అప్పటి వరకు ఎక్కువగా ఆవిరి ఇంజిన్లపై ఆధారపడిన రైల్వే వ్యవస్థ, విద్యుత్ ఆధారిత రైళ్ల వైపు మళ్లడం మొదలయ్యింది.
విద్యుత్ రైళ్లు రావడం వల్ల ప్రయాణం మరింత సులభంగా, వేగంగా మారింది. ఆవిరి ఇంజిన్లతో పోలిస్తే ఇవి తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయి. అలాగే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా తగ్గుతాయి. ఈ కారణాలతో రైల్వే శాఖ విద్యుతీకరణపై దృష్టి పెట్టడం ప్రారంభించింది. తొలినాళ్లలో ఈ సేవలు కేవలం చిన్న మార్గంలో మాత్రమే కొనసాగినా, తర్వాత దశలవారీగా విస్తరించారు. ముంబై ప్రాంతం నుంచి ఈ విద్యుత్ లైన్ ను నాసిక్ సమీపంలోని ఇగత్ పురి వరకు విస్తరించారు. గిరి ప్రాంతాల్లో రైళ్లను సులభంగా నడపడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఈ సేవలను పూణే వరకు కూడా తీసుకెళ్లారు. నెమ్మదిగా విద్యుత్ రైళ్ల పరిధి క్రమంగా పెరుగుతూ వచ్చింది.
విద్యుత్ రైళ్ల వల్ల ప్రయాణికులకు బోలెడు లాభాలు కలిగాయి. రైళ్లు వేగంగా నడవడం, స్టేషన్ల మధ్య సమయం తగ్గడం వల్ల ప్రయాణం సౌకర్యవంతంగా మారింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణం చేసే వారికి చాలా ఉపయోగకరంగా మారింది. ముంబైలో లోకల్ ట్రైన్ వ్యవస్థ అభివృద్ధి చెందడంలో కూడా విద్యుత్ రైళ్ల పాత్ర చాలా కీలకంగా మారింది.
విద్యుత్ రైళ్లు పర్యావరణానికి అనుకూలంగా ఉంటాయి. ఇంధన వినియోగం తగ్గడం వల్ల కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇది భవిష్యత్తులో మరింత స్థిరమైన రవాణా వ్యవస్థకు దారితీసింది. 1925లో ప్రారంభమైన ఈ విద్యుత్ రైలు ప్రయాణం, తర్వాత దేశ రైల్వే వ్యవస్థను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం దేశంలోని దాదాపు అన్ని మార్గాలు విద్యుతీకరించబడ్డాయి. ఇది రైల్వే రంగంల ఓ పెద్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. దేశంలో మొదటి విద్యుత్ రైలు ప్రారంభం కేవలం ఒక కొత్త సేవ మాత్రమే కాదు, రవాణా రంగంలో అభివృద్ధికి బాటలు వేసిన ఒక చారిత్రక ఘట్టం. దేశ ప్రగతికి కారణమైన అత్యంత కీలకమైన అడుగుగా నిలిచింది.
Read Also: అమ్మో ఇండియన్ రైల్వే.. అన్ని లక్షల మంది పని చేస్తున్నారా?