పాకిస్తాన్ పరిస్థితి రోజు రోజుకు మరింత దిగజారుతోంది. ఇప్పటికే ప్రజలు గోధుమ పిండి కూడా లేక అవస్థలు పడుతుండగా, ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం పరిస్థితి కూడా అంతే దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ రైల్వే ఆధ్వర్యంలో నడుస్తున్న రైళ్లు ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కొన్ని రైళ్లను కమర్షియల్ ఆపరేషన్స్ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే ఏ రైళ్లను ప్రైవేట్ పరం చేయాలనే అంశానికి సంబంధించి కసరత్తు పూర్తి చేసినట్లు ఆ దేశ రైల్వే అధికారులు వెల్లడించారు.
11 ప్యాసింజర్ రైళ్లు ప్రైవేట్ పరం
ప్రస్తుతం పాక్ రైల్వే సంస్థ నడిపిపిస్తున్న 11 ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేట్ రంగానికి అప్పగించాలని నిర్ణయించింది. హజారా ఎక్స్ ప్రెస్, బహావుద్దీన్ జకారియా ఎక్స్ ప్రెస్, మిల్లత్ ఎక్స్ ప్రెస్, సుబక్ ఖరం ఎక్స్ ప్రెస్, రావల్ ఎక్స్ ప్రెస్, బదర్ ఎక్స్ప్రెస్, ఘోరి ఎక్స్ ప్రెస్, రవి ఎక్స్ ప్రెస్, థాల్ ఎక్స్ ప్రెస్, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మోయెంజో దారో ప్యాసింజర్ రైళ్లను వాణిజ్య నిర్వహణ కోసం ప్రైవేట్ రంగానికి అప్పగించబోతోంది.
ఆగష్టు 12 లోపు బిడ్ల ఆహ్వానం
అటు ఆగష్టు 12 లోపు ప్రైవేట్ రంగం నుంచి బిడ్లను ఆహ్వానించాలని పాకిస్తాన్ రైల్వే నిర్ణయించింది. పాకిస్తాన్ రైల్వే ఇప్పటికే ఏడు ప్యాసింజర్ రైళ్ల నిర్వహణను ప్రైవేట్ రంగానికి అవుట్ సోర్స్ చేసింది. హజారా ఎక్స్ ప్రెస్, కరాచీ ఎక్స్ ప్రెస్, ఫరీద్ ఎక్స్ ప్రెస్, బహావుద్దీన్ జకారియా ఎక్స్ ప్రెస్, సుక్కూర్ ఎక్స్ ప్రెస్, రావల్పిండి ఎక్స్ప్రెస్ రైళ్లను ఇప్పటికే ప్రైవేట్ పరం చేసింది. కొద్ది నెలల్లోనే మరో 11 రైళ్లను ఔట్ సోర్స్ చేయలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో పాక్ రైల్వే పూర్తిగా ప్రైవేట్ పరం అయ్యే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
పాక్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందంటే?
ప్రస్తుతం పాకిస్తాన్ రైల్వే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని రైళ్లను ప్రైవేట్ పరం చేసి, వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వేశాఖ మౌళిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థిక సమస్యల్లో ఉన్న పాకిస్తాన్ రైల్వే ఆదాయాన్ని పెంచుకు మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగానే టికెట్ ధరలను రెండుసార్లు పెంచింది. ఈ నెల ప్రారంభంలో ప్యాసింజర్, ఎక్స్ ప్రెస్, మెయిల్ రైళ్లకు సంబంధించి టికెట్ ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కేవలం 15 రోజుల్లో రెండు సార్లు టికెట్ ఛార్జీలు పెంచడంతో ప్రయాణీకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. డీజిల్ ధర పెరుగుదల కారణంగా పాకిస్తాన్ రైల్వే నెలకు 109 మిలియన్ల నష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. పాకిస్తాన్ లో పెట్రోల్ ధరను కూడా ప్రభుత్వం లీటరుకు రూ. 8.36 పెంచింది.
Read Also: రైలులో టీటీఈకి.. మీ టికెట్ చూపించి కన్ఫార్మ్ చేయించుకోకపోతే ఏమవుతుంది?