Hyderabad railway development: హైదరాబాద్ నగరంలో ప్రతిరోజూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులు.. అందరికీ ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. సిటీకి చెందిన ఒక ప్రముఖ రైల్వే స్టేషన్ ఇప్పుడు కొత్త రూపం దాలుస్తోంది. దీని రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి. ఈ మార్పులు పూర్తయ్యాక స్టేషన్లోకి అడుగుపెడితే.. ఎయిర్పోర్ట్కి వచ్చామా? అన్న అనుభూతి కలుగుతుంది. రైల్వే శాఖ అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ABSS) కింద ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. సుమారు రూ. 26.81 కోట్ల భారీ బడ్జెట్తో హుప్పుగూడ రైల్వే స్టేషన్ అద్భుతంగా మారబోతోంది.
❂ ఎయిర్పోర్ట్ అనుభూతి కలిగించే సదుపాయాలు
ఇప్పటివరకు రైల్వే స్టేషన్ అనగానే మనకి రద్దీ, ఇబ్బందులు గుర్తొస్తాయి. కానీ హుప్పుగూడ స్టేషన్లో రాబోయే మార్పులు వీటన్నింటినీ పక్కన పెట్టబోతున్నాయి. ప్లాట్ఫారమ్ల రూపం, వేటింగ్ హాల్స్, కాంకోర్స్ ఏరియాలు.. అన్నీ ఎయిర్పోర్ట్ మోడల్లో ముస్తాబవుతున్నాయి. 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FoB), రెండు ప్యాసింజర్ లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు ప్రయాణికుల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రయాణికులు ప్లాట్ఫారమ్లను సులభంగా మారవచ్చు.
❂ రోజుకు వేలాది ప్రయాణికుల రద్దీ
ప్రస్తుతం హుప్పుగూడ స్టేషన్కి రోజూ సుమారు 5,000 మంది ప్రయాణికులు వస్తుంటారు. ప్రధానంగా హైటెక్ సిటీ, లింగంపల్లి వైపు సబ్ర్బన్ ట్రైన్స్ వినియోగించే ఉద్యోగులకు ఇది చాలా పెద్ద హబ్. కొత్త లుక్, మోడర్న్ సదుపాయాలు ట్రావెల్ అనుభవాన్ని మరింత సౌకర్యవంతంగా మారుస్తాయి.
❂ ప్లాట్ఫారమ్లకు కొత్త రూపం
ప్రస్తుతానికి వెయిటింగ్ హాల్స్, టికెట్ కౌంటర్లు పాతబడి ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ప్రాజెక్ట్ కింద ఇవన్నీ రీడిజైన్ అవుతున్నాయి. ప్లాట్ఫారమ్లకు స్లిప్ లేని ఫ్లోరింగ్, వెడల్పైన మార్గాలు, ఆధునిక సైన్బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. వర్షం లేదా వేసవిలో ఇబ్బంది లేకుండా ప్లాట్ఫారమ్ కవర్ కూడా పెంచుతున్నారు.
❂ దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్స్
మొత్తం ప్రాజెక్ట్లో ముఖ్యమైన అంశం దివ్యాంగుల సౌకర్యాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం. లిఫ్టులు, ర్యాంపులు, ప్రత్యేక టాయిలెట్స్, సులభమైన ప్రవేశ మార్గాలు.. అన్నీ దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రావెల్ అనుభవం కలిగించేందుకు సిద్ధం అవుతున్నాయి.
❂ హుప్పుగూడ మాత్రమే కాదు
హుప్పుగూడ స్టేషన్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రంలో మరో 40 స్టేషన్లను ABSS కింద అప్గ్రేడ్ చేస్తున్నారు. వీటిలో బేగంపేట్, వరంగల్, కరీంనగర్ స్టేషన్లు ఇప్పటికే కొత్త సదుపాయాలతో ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మీద రైల్వే శాఖ రూ. 2,750 కోట్ల భారీ ప్రాజెక్ట్ తో రాష్ట్రంలో స్టేషన్ల రూపురేఖలు మార్చేస్తోంది.
Also Read: Luxury railway stations India: మన దేశంలో టాప్ రైల్వే స్టేషన్ అంటే ఇదే.. ఎందుకింత స్పెషల్?
❂ 2025 డిసెంబర్ డెడ్లైన్
రైల్వే శాఖ లక్ష్యం 2025 డిసెంబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయడం. అప్పటికి హుప్పుగూడ స్టేషన్ హైదరాబాద్లోని అత్యాధునిక సబర్బన్ స్టేషన్గా మారుతుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక ప్రయాణికులు ఇది రైల్వే స్టేషనా? లేక ఎయిర్పోర్టా? అని ఆశ్చర్యపోవడం ఖాయం.
❂ ఎందుకు ప్రత్యేకం?
12 మీటర్ల కొత్త FoB, రెండు లిఫ్టులు, రెండు ఎస్కలేటర్లు, కొత్త కాంకోర్స్, వెయిటింగ్ హాల్స్, మోడర్న్ ఫుడ్ కోర్ట్స్, టికెట్ కౌంటర్లు, డిజిటల్ సైన్బోర్డులు, నూతన ఫర్నిచర్, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్స్.. ఈ సౌకర్యాలన్నీ ఇక్కడ ప్రయాణీకుల దరి చేరనున్నాయి.
❂ ప్రయాణికులకు లాభాలే లాభాలు
ఉద్యోగస్తులు, విద్యార్థులు ఇక నుంచి ప్లాట్ఫారమ్లలో ఇబ్బందులు లేకుండా సులభంగా రైళ్లు అందుకొనే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. బిజీ టైమ్లో కూడా రద్దీ అనిపించకుండా విస్తృతమైన కాంకోర్స్ ఏరియాలు, సులభమైన టికెటింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. రాబోయే నెలల్లో హుప్పుగూడ స్టేషన్ హైదరాబాద్ సిటీ ట్రావెల్కు గర్వకారణంగా నిలుస్తుంది. ఆధునిక సదుపాయాలతో పాటు శుభ్రత, భద్రత, హైటెక్ సర్వీసులు ప్రయాణికులను ఆకట్టుకుంటాయి.