ప్రపంచ పర్యాటకులకు స్వర్గధామంగా ఉన్న థాయ్ లాండ్.. ఇప్పుడు యుద్ధవాతావరణంతో వణికిపోతోంది. కాంబోడియాతో థాయ్ లాండ్ యుద్ధానికి దిగింది. తాజాగా థాయిలాండ్ కంబోడియా సరిహద్దులో F-16 ఫైటర్ జెట్లను మోహరించింది. వివాదాస్పద సరిహద్దు ఈశాన్య భాగానికి సమీపంలో ఉన్న సైనిక స్థావరాలను కంబోడియా లక్ష్యంగా చేసుకున్నట్లు రాయల్ థాయ్ సైన్యం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే థాయ్ లాండ్ ధీటుగా బదులిచ్చినట్లు తెలిపింది. ఇవాళ తెల్లవారుజామున, వివాదాస్పద సరిహద్దులోని ఆరు ప్రదేశాలలో ఘర్షణలు జరిగినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది. థాయ్ లాండ్ సరిహద్దులో 6 F-16 పైటర్ జెట్లను మోహరించగా.. అందులో ఓ ఫైటర్ జెట్ కంబోడియాలోకి దూసుకెళ్లి, సైనిక లక్ష్యాన్ని ధ్వంసం చేసినట్లు థాయ్ సైనికాధికారులు వెల్లడించారు. సుమారు 9 మంది సైనికులు చనిపోయినట్లు తెలిపింది. “మేము ప్రణాళిక ప్రకారం సైనిక లక్ష్యాలపై వైమానిక శక్తిని ప్రదర్శించాం. పలు సైనిక స్థావరాలు ధ్వంసం అయ్యాయి. కాంబోడియా ఎదురుదాడిని పకడ్బందీగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం” అని థాయ్ లాండ్ ఆర్మీ డిప్యూటీ ప్రతినిధి రిచా సుక్సువానన్ వెల్లడించారు.
థాయ్ లాండ్ పై కాంబోడియా రాకెట్ దాడులు
అటు థాయ్ లాండ్ దాడులకు ప్రతికగా కంబోడియా సైనికులు సురిన్ లోని థాయ్ సైనిక స్థావరంపై కాల్పులు జరిపారు. సిసాకెట్ వైపు అనేక రాకెట్ దాడులు చేసినట్లు థాయిలాండ్ వెల్లడించింది. మరోవైపు సరిహద్దుల్లో మోహరించిన అన్ని F-16 జెట్లు కాంబోడియాలోని పలు స్థావరాలను ధ్వంసం చేసి తిరిగి వచ్చినట్లు థాయ్ సైన్యం ప్రకటించింది. “కంబోడియన్ బెటాలియన్లపై బాంబులు వేసిన థాయ్ F-16 విమానాలు సురక్షితంగా తిరిగి వచ్చాయి. ఏ విమానానికి ఎలాంటి ముప్పు వాటిళ్ల లేదు” అని థాయ్ సైన్యం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.
సరిహద్దు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
కాంబోడియా దాడుల నేపథ్యంలో థాయ్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు ప్రాంతాలలోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. కంబోడియాతో ఉన్న వివాదాస్పద భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా థాయిలాండ్ భారీ ఆయుధాలు, వైమానిక దాడులు, రాకెట్లను ఉపయోగించిందని కంబోడియా జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. “ఈ చట్టవిరుద్ధమైన, బాధ్యతారహితమైన చర్యలు ప్రాంతీయ శాంతి, స్థిరత్వానికి తీవ్ర ముప్పును కలిగిస్తాయి,. అంతర్జాతీయంగా ఎన్నో వివాదాలకు కారణం అవుతాయని రక్షణశాఖ ప్రతినిధి మాలీ సోచెటా ఖైమర్ వెల్లడించారు. థాయ్ ఫైటర్ జెట్లు రోడ్డుపై రెండు బాంబులను వేశాయని, థాయిలాండ్ కంబోడియాతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగిందని రక్షణశాఖ తెలిపింది.
కొనసాగుతున్న ఉద్రికత్తలు
థాయిలాండ్, కంబోడియా మధ్య గురువారం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. థాయ్ సైన్యం వెల్లడించిన వివరాల ప్రకారం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో టా ముయెన్ థామ్ ఆలయం ముందు ఒక కంబోడియన్ డ్రోన్ కనిపించింది. ఆ తర్వాత ఆయుధాలు, గ్రెనేడ్లతో ఉన్న ఆరుగురు కంబోడియన్ సైనికులు థాయ్ సైనిక స్థావరం ముందు కనిపించారు. ఉదయం 8:20 గంటల ప్రాంతంలో, కంబోడియన్ సైన్యం సైనిక స్థావరం వైపు కాల్పులు జరిపిందని థాయ్ సైన్యం తెలిపింది. ఆ తర్వాత తాము ఎదురుదాడికి దిగినట్లు థాయ్ సర్కారు తెలిపింది.
Read Also: అహ్మదాబాద్ సీన్ రిపీట్, విమానం కూలి 49 మంది సజీవదహనం!