BIG TV LIVE Originals: దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మెట్రో రైళ్లను ప్రారంభించారు. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, కొచ్చి, కోల్ కతా, హైదరాబాద్ నగరాల్లో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. సులభంగా, వేగంగా ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడంలో ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మెట్రో సంస్థ ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఛార్జీలు మే 17 నుంచి అందుబాటులోకి వస్తాయని ప్రకటించింది. అయితే, దేశంలోని ఇతర మెట్రో రైళ్లతో పోల్చితే హైదరాబాద్ మెట్రో ఛార్జీలు ఎక్కువా? తక్కువా? అనేది చూద్దాం..
⦿ హైదరాబాద్ మెట్రో
నవంబర్ 2017 నుంచి హైదరాబాద్ మెట్రో అందుబాటులోకి వచ్చింది. నగరంలో మొత్తం 67 కిలో మీటర్ల దూరంలో విస్తరించి ఉంది. 57 స్టేషన్లు, మూడు లైన్లలో సేవలు అందిస్తోంది. తాజాగా పెంచిన ఛార్జీలతో కనీస ఛార్జీ రూ. 12 (2 కి.మీ వరకు)గా నిర్ణయించింది. గరిష్టంగా రూ.75 (24 కి.మీ దాటి)గా ఫిక్స్ చేసింది. స్మార్ట్ కార్డుల ద్వారా 10% వరకు టికెట్ ధరపై రాయితీ ఇస్తున్నది.
⦿ కొచ్చి మెట్రో
కొచ్చి మెట్రో జూన్ 2017 నుంచి ప్రజలకు సేవలు అందిస్తున్నది. ఈ రైలు అలువా నుంచి త్రిపునితుర వరకు 25.6 కి.మీ పరిధిలో విస్తరించి ఉంది. కొచ్చి మెట్రో ఛార్జీ కనిష్టంగా రూ. 10 (2 కి.మీ వరకు) కాగా, గరిష్టం రూ. 60 (25 కి.మీ)ని వసూలు చేస్తోంది. కొచ్చిమెట్రో 20% 1 కార్డ్ డిస్కౌంట్, 50% నాన్-పీక్ డిస్కౌంట్ అందిస్తోంది. హైదరాబాద్ మెట్రోతో పోల్చితే కొచ్చి మెట్రో ప్రయాణ ఖర్చు తక్కువగా ఉంది.
⦿ ఢిల్లీ మెట్రో
దేశ రాజధానిలో మెట్రో రైలు 2002లో అందుబాటులోకి వచ్చింది. మొత్తం 353.3 కి.మీ పరిధిలో మెట్రో విస్తరించి ఉంది. ఢిల్లీ మెట్రో కనిష్టంగా రూ.10, గరిష్టంగా రూ. 60 (32 కి.మీ. దాటి) ఛార్జీని వసూళు చేస్తోంది. స్మార్ట్ కార్డ్ ద్వారా విద్యార్థులు, సీనియర్ సిటిజన్లకు 10 నుంచి 20% డిస్కౌంట్లు అందిస్తోంది. ఢిల్లీ సబ్సిడీ మోడల్ ఛార్జీలు హైదరాబాద్ కంటే తక్కువగా ఉన్నాయి.
⦿ బెంగళూరు మెట్రో
బెంగళూరులో మెట్రో రైలు సౌకర్యం 2011లో అందుబాటులోకి వచ్చింది. బెంగళూరు నమ్మ మెట్రో కనీస ఛార్జీ రూ. 10గా నిర్ణయించింది. గరిష్ట ఛార్జీ రూ. 90 (42 కి.మీ)గా ఫిక్స్ చేసింది. స్మార్ట్ కార్డుపై 5 నుంచి 10% డిస్కౌంట్ అందిస్తోంది. బెంగళూరు ఛార్జీలు హైదరాబాద్ కంటే ఎక్కువగా ఉన్నాయి.
⦿ చెన్నై మెట్రో
చెన్నైలో మెట్రో సేవలు 2015లో ప్రారంభమయ్యాయి. మొత్తం 54.1 కిలో మీటర్ల పరిధిలో మెట్రో సూవలు అందుతున్నాయి. ఇక్కడ కూడా కనిష్ట ధర రూ. 10 కాగా, గరిష్టంగా రూ. 50గా నిర్ణయించింది. స్మార్ట్ కార్డ్ మీద 10 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. భూగర్భ సేవలు అందిస్తున్నప్పటికీ చెన్నౌ మెట్రో ఛార్జీలు హైదరాబాద్ కంటే తక్కువగా ఉన్నాయి.
⦿ ముంబై మెట్రో
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మెట్రో సేవలు 2014లో ప్రారంభం అయ్యాయి. మొత్తం 59.2 కిలో మీటర్ల పరిధిలో మెట్రో రైల్ విస్తరించి ఉంది. ఈ మెట్రో కనిష్ట ఛార్జీని రూ. 10 గా, గరిష్ట ఛార్జీని రూ. 70గా ఫిక్స్ చేసింది. స్మార్ట్ కార్డు మీద 10 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
⦿ కోల్ కతా మెట్రో
కోల్ కతా నగరంలో 1984 నుంచి మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. దేశంలో 58.7 కి.మీ పరిధిలో విస్తరించిన ఈ మెట్రో.. దేశంలోనే అత్యల్ప ఛార్జీలతో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది. ఇక్కడ కనిష్ట ఛార్జీ రూ. 5గా నిర్ణయించారు. గరిష్టంగా రూ. 25గా ఫిక్స్ చేశారు. స్మార్ట్ కార్డ్ పై 10 శాతం లభిస్తుంది. దేశంలోనే అత్యంత సరసమైన మెట్రో ప్రయాణాన్ని అందిస్తున్న సంస్థగా కోల్ కతా మెట్రో గుర్తింపు తెచ్చుకుంది.
హైదరాబాద్ మెట్రో రేట్లతో పోల్చితే..
హైదరాబాద్ మెట్రో ఛార్జీలు (రూ.12– రూ.75)గా ఉన్నాయి. కోల్ కతా, చెన్నై, ఢిల్లీ, కొచ్చితో పోల్చితే ఎక్కువగానే ఉన్నాయి. బెంగళూరు గరిష్ట ఛార్జీల కంటే తక్కువగా ఉన్నాయి. కొచ్చి డిస్కౌంట్లు, ఢిల్లీ ఛార్జీలు కూడా తక్కువగానే ఉన్నాయి. అయితే, కోల్కతా మెట్రో ఛార్జీలు దేశంలోనే అత్యంత తక్కువగా ఉన్నాయి.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.
Read Also: మెట్రో ఛార్జీల మోత.. ఇలా చేస్తే తక్కువ ఖర్చుతో హ్యాపీ జర్నీ!