Begumpet Airport Runway Tunnel: హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కీలక ప్రాజెక్ట్ రాబోతోంది. ఈ అరుదైన ప్రాజెక్టు త్వరలో ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలోనే తొలిసారి ఇలాంటి ప్రాజెక్ట్ నిర్మాణం జరగబోతోంది. బేగంపేట్ విమానాశ్రయ రన్ వే కింది నుంచి 600 మీటర్ల పొడవుతో ఆరు లేన్ల అండర్ పాస్ టన్నెల్ నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ కు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) నుంచి త్వరలో గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ అండర్ పాస్ ప్రాజెక్ట్ మొత్తం రూ. 550 కోట్లు. హైదరాబాద్ లోని ప్యారడైజ్ నుంచి సుచిత్ర జంక్షన్ వరకు సుమారు 5.5 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగానే బేగంపేట్ ఎయిర్ పోర్ట్ రన్వే కింద టన్నెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన AAI పరిశీలనలో ఉంది. డిజైన్లు, భద్రతా అంశాలను NHAI, AAI నిపుణులు పరిశీలిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కు AAI బోర్డు అనుమతి అవసరం ఉండడంతో, వచ్చే రెండు వారాల్లో తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏమిటంటే.. విమానాశ్రయ రన్వే కింద ట్రాఫిక్ టన్నెల్ నిర్మించడం. దేశంలోనే ఇలాంటి నిర్మాణం జరగడం ఇదే తొలిసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారం కాబోతుందన్నారు. ఈ టన్నెల్ నిర్మాణానికి మరో ముఖ్య కారణం తాడ్ బండ్ ప్రాంతంలో ఉన్న ప్రమాదకర మలుపు. ఆ మలుపు వల్ల రోడ్డు విస్తరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని దాటేందుకు టన్నెల్ మార్గాన్ని ఎంచుకున్నారు. ఈ మార్గం ద్వారా వాహనాలు సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.
ఈ కారిడార్ ప్రాజెక్ట్ పూర్తయితే, హైదరాబాద్ ఉత్తర భాగాలకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే ప్యారడైజ్ ప్రాంతంలో పనులు ప్రారంభమై పురోగతిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
అటు ఇదే తరహాలో ఉత్తర ప్రదేశ్లోని వారణాసి విమానాశ్రయం రన్ వే కింద అండర్ పాస్ నిర్మాణం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ముందుగా ప్రతిపాదన పంపినప్పటికీ, ఉత్తర ప్రదేశ్ ప్రాజెక్ట్ కు ముందుగా అనుమతి లభించిందని సమాచారం. ఏదైతేనేం, బేగంపేట్ టన్నెల్ ప్రాజెక్ట్ హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యకు కీలక పరిష్కారంగా మారే అవకాశముంది. అనుమతులు పూర్తయిన తర్వాత పనులు వేగంగా పూర్తి చేసి, వచ్చే రెండేళ్లలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Read Also: సికింద్రాబాద్ నుంచి స్పెషల్ రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!