UP Train Attack: ఉత్తరప్రదేశ్లో కదులుతున్న రైలులో ఓ విద్యార్థిపై జరిగిన దాడి కలకలం రేపుతున్నాయి. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు విద్యార్థిని దూషిస్తూ, మద్యం తాగాలని బలవంతం చేసినట్లు ఫిర్యాదు నమోదైంది. అంతటితో ఆగకుండా కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేందుకు కూడా ప్రయత్నించినట్లు సదరు విద్యార్థి ఆరోపించాడు. బాధితుడిని మీరట్ లోని సర్ధానా ప్రాంతానికి చెందిన మహమ్మద్ ముంతాజిర్ గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన సహారన్పూర్ చదువుతున్నట్లు సమాచారం.
శనివారం సాయంత్రం ముంతాజిర్ మీరట్ కంటోన్మెంట్ నుంచి డియోబంద్ వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కాడు. కోచ్లో అప్పటికే 10 నుంచి 12 మంది యువకులు ఉన్నారు. వారు ఏకంగా రైల్లోనే మద్యం తాగుతున్నారు. రైలు దౌరాలా, సకౌటి స్టేషన్ల మధ్య వెళ్తున్న సమయంలో తనను కొందరు యువకులు అసభ్యంగా కామెంట్ చేయడం మొదలు పెట్టారు. తన దుస్తులు, గడ్డం చూసి అసభ్యంగా మాట్లాడారని ఆరోపించాడు. యువకులు తన గడ్డాన్ని పట్టుకుని మతపరమైన దూషణలకు పాల్పడ్డారని ముంతాజిర్ ఫిర్యాదులో వెల్లడించాడు. తనకు బలవంతంగా మద్యం తాగించేందుకు ప్రయత్నించారని, తాను నిరాకరించడంతో కొట్టారని ఆరోపించాడు. వారి నుంచి తప్పించుకునేందుకు మరో కోచ్లోకి వెళ్లాలని ప్రయత్నించినప్పటికీ వారు అడ్డుకున్నారని తెలిపాడు. తన బ్యాగ్ను కూడా లాక్కున్నారని చెప్పాడు.
అటు నిందితుల్లో ఇద్దరు తనను కదులుతున్న రైలు కిటికీ వైపు లాగి బయటకు తోసేందుకు ప్రయత్నించారని తెలిపాడు. తాను గట్టిగా కేకలు వేయడంతో అదే కోచ్లో ఉన్న ఇతర ప్రయాణికులు స్పందించి తనకు సహాయం చేశారని చెప్పాడు. ఈ సమయంలో నిందితుల్లో ఒకరు సకౌటి స్టేషన్లో రైలు దిగి, తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ముంతాజిర్ ఖటౌలి స్టేషన్లో దిగి జీఆర్పీ, స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనపై ఫిర్యాదు అందినట్లు ఖటౌలి పోలీస్ ఇన్స్పెక్టర్ దినేష్ బఘేల్ తెలిపారు. సకౌటి, ఖటౌలి రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో లభించే ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రైలులో ప్రయాణికుల రద్దీ ఉన్నప్పటికీ కోచ్లో జీఆర్పీ లేదా ఆర్పీఎఫ్ సిబ్బంది లేకపోవడంపై బాధితుడు ప్రశ్నలు లేవనెత్తాడు. రైలులో బహిరంగంగా మద్యం సేవించినట్లు ఆరోపణలు రావడం కూడా భద్రతా వ్యవస్థపై చర్చకు దారితీసింది. ఈ ఘటన నేపథ్యంలో మీరట్–ముజఫర్నగర్–సహారన్పూర్ మార్గంలో ప్రయాణించే విద్యార్థుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అటు ఈ రైల్వే మార్గంలో గస్తీని పెంచేందుకు జీఆర్పీ ముజఫర్నగర్ విభాగాన్ని అప్రమత్తం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పూర్తి దర్యాప్తు కొనసాగుతోంది.
Read Also: దక్షిణం నుంచి తూర్పు భారతం వరకు.. 7 రాష్ట్రాలను కలిపే కొత్త అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్!