Kalka-Shimla Railway Tourism: పర్వతాల మధ్య పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ప్రయాణించే కల్కా-సిమ్లా రైల్వేకు మరింత ప్రచారం కల్పించేందుకు అధికారులు సూపర్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ చారిత్రక రైల్వే మార్గాన్ని పర్యాటకులకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పలు కీలక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియాకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కల్కా-సిమ్లా రైల్వేకు సంబంధించిన రీల్స్, షార్ట్ వీడియోలు, ఇతర డిజిటల్ కంటెంట్ను రూపొందించి ప్రచారం చేయాలని అధికారులు భావిస్తున్నారు. రైల్వే మార్గంలోని అందమైన దృశ్యాలు, చారిత్రక ప్రదేశాలు, సొరంగాలు, వంతెనలను వీడియోల రూపంలో చూపించడం ద్వారా యువతను ఆకర్షించాలని చూస్తున్నారు. సిమ్లాలో జరిగిన కల్కా-సిమ్లా రైల్వే జాయింట్ కమిటీ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగింది. పర్యాటకాన్ని పెంచడంతో పాటు రైల్వే వారసత్వాన్ని భవిష్యత్ తరాలకు కాపాడటంపై కూడా సమావేశంలో దృష్టి పెట్టారు.
ఈ చారిత్రక రైల్వేకు మరింత గుర్తింపు తీసుకురావడానికి వారసత్వ దినోత్సవాలు, ప్రత్యేక సందర్భాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు వార్షిక క్యాలెండర్ రూపొందించాలని నిర్ణయించారు. దీనివల్ల ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలతో పర్యాటకులను ఆకర్షించే అవకాశం ఉంటుంది.
సిమ్లాలోని బాబా భల్కు రైల్వే మ్యూజియాన్ని పర్యాటకులు, విద్యార్థులు, రైల్వే అభిమానులకు మరింత చేరువ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పాఠశాలల నుంచి విద్యా పర్యటనలను ప్రోత్సహించడం ద్వారా పిల్లలకు ఈ రైల్వే చరిత్ర, నిర్మాణం గురించి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బాబా భల్కు రామ్ స్వయంకృషితో ఇంజనీరింగ్ నైపుణ్యం సంపాదించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. బ్రిటిష్ ఇంజనీర్లు ఎదుర్కొన్న సవాళ్ల సమయంలో కల్కా-సిమ్లా రైల్వే నిర్మాణంలో ఆయన సహకారం అందించిచారు. ముఖ్యంగా బరోగ్ టన్నెల్ నంబర్ 33 నిర్మాణానికి సంబంధించిన పనుల్లో ఆయన పాత్రను గుర్తుచేసుకుంటారు.
రైల్వే ట్రాక్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు క్రమం తప్పకుండా శుభ్రత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. పర్యాటక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా సందర్శకులకు మెరుగైన అనుభవం కల్పించవచ్చని అధికారులు భావిస్తున్నారు.
కల్కా-సిమ్లా మార్గంలో ప్రత్యేక కోచ్ల బుకింగ్ను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోనున్నారు. కొండ ప్రాంతాల మధ్య సాగే ఈ ప్రత్యేక రైలు ప్రయాణాన్ని పర్యాటకులు ప్రత్యేక అనుభూతిగా భావించేలా రైలు ఆధారిత పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించనున్నారు.
కల్కా-సిమ్లా రైల్వే మార్గం సుమారు 96 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. 2 అడుగుల 6 అంగుళాల నారో గేజ్పై ఈ రైల్వే నిర్మించారు. అందుకే ఈ మార్గంలో నడిచే రైళ్లను సాధారణంగా టాయ్ ట్రైన్లుగా పిలుస్తారు. ఈ రైల్వే మార్గంలో నవంబర్ 1903లో రాకపోకలకు ప్రారంభించారు. కొండలు, లోయలు, వంతెనలు, సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం ఇప్పటికీ పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
Read Also: పశ్చిమ కనుమల్లో వందేభారత్ కనువిందు.. పచ్చని అడవిలో ఎర్రని మెరుపుతీగలా..