Western Railway Bedsheets Spotted in Market: రైల్లో ఏసీ కోచ్ లో ప్రయాణించే ప్యాసింజర్స్ కు అందించే బెడ్షీట్లు, దుప్పట్లు, టవల్స్ ప్రయాణం ముగిసిన తర్వాత తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, కొందరు వాటిని తమతో తీసుకెళ్తుండటంతో రైల్వేకు భారీ నష్టం కలుగుతోంది. తాజాగా ఈ సమస్యను మరోసారి గుర్తు చేసేలా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది.
వైరల్ వీడియోలో ముగ్గురు వ్యక్తులు తెల్లటి బెడ్ షీట్లను శాలువాల మాదిరిగా భుజాలపై కప్పుకుని మార్కెట్లో నడుస్తూ కనిపించారు. ఆ బెడ్షీట్లపై స్పష్టంగా WESTERN RAILWAY అనే అక్షరాలు కనిపించడంతో వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తుల దగ్గర ఉన్న వస్తువులు నిజంగానే రైల్వే నుంచి చోరీకి గురైనవేనా అనేది తెలియాల్సి ఉంది. కానీ, వైరల్ వీడియో రైల్వే లినెన్ చోరీలపై మరోసారి చర్చకు కారణం అయ్యింది.
ఆర్టీఐ ఆధారంగా వెల్లడైన వివరాల ప్రకారం, 2022 జనవరి నుంచి 2026 మే వరకు భారతీయ రైల్వేకు చెందిన 1.27 కోట్లకు పైగా బెడ్ రోల్ వస్తువులు మాయం అయ్యాయి. ఇందులో బెడ్షీట్లు, టవల్స్, దుప్పట్లు, దిండ్లు, పిల్లో కవర్లు లాంటి వస్తువులు ఉన్నాయి. ఈ స్థాయి చోరీల కారణంగా కాంట్రాక్టర్లకు సుమారు రూ.104.51 కోట్ల నష్టం వాటిల్లినట్లు సమాచారం. కేవలం బెడ్షీట్లే 41.13 లక్షలకు పైగా మాయమైనట్లు రైల్వే వివరాలు చెబుతున్నాయి.
ప్రతి రోజు వేలాది మంది ప్రయాణికులకు ఏసీ కోచ్ లలో లినెన్ కిట్లు అందిస్తారు. ప్రయాణం పూర్తయిన తర్వాత వాటిని సేకరించి శుభ్రపరిచి మళ్లీ వినియోగిస్తారు. కానీ, బెడ్షీట్లు, టవల్స్, దుప్పట్లు తిరిగి రాకపోవడం రైల్వేపై అదనపు భారం పడేలా చేస్తోంది. ఇలాంటి చోరీల కారణంగా కొత్త లినెన్ను తరచూ కొనుగోలు చేయాల్సి వస్తుంది. దీంతో రైల్వే వ్యవస్థపై పరోక్షంగా ఆర్థిక భారం పెరుగుతోంది.
ముగ్గురు వ్యక్తులు రైల్వే బెడ్షీట్లను శాలువాలుగా కప్పుకున్న వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియాలో పలురువు సీరియస్ అవుతున్నారు. రైల్వే వస్తులను చోరీ చేయడంపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు కేవలం దొంగతనంగా మాత్రమే కాకుండా, ప్రజా ఆస్తుల పట్ల బాధ్యతారాహిత్యానికి ఉదాహరణగా మారుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: కదులుతున్న రైల్లో దారుణం.. విద్యార్థికి మద్యం తాగించి, ఆపై..