Hyderabad Regular Train Services: వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి నడుస్తున్న మూడు ప్రత్యేక రైళ్లను ఇప్పుడు రెగ్యులర్ సర్వీసులుగా మార్చింది. ఈ నిర్ణయంతో తెలంగాణ నుంచి సౌత్, ఈస్ట్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది. కొన్ని మార్గాల్లో ప్రయాణికుల డిమాండ్ పెద్ద మొత్తంలో పెరగడంలో రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ప్రత్యేక రైళ్లను రెగ్యుల సర్వీసులుగా కొనసాగించాలని నిర్ణయించారు.
⦿ కాచిగూడ–ట్యూటికోరిన్ ఎక్స్ ప్రెస్: తాజాగా కాచిగూడ–మధురై స్పెషల్ (07191/07192) రైలును ఇప్పుడు కాచిగూడ–ట్యూటికోరిన్ ఎక్స్ ప్రెస్ (17165/17166) గా మార్చుతూ భారతీయ రైల్వే నిర్ణయం తీసుకుంది. ఈ రైలు ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి.. మంగళవారం రాత్రికి ట్యూటికోరిన్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరుతుంది.
⦿ హైదరాబాద్–కన్యాకుమారి ఎక్స్ప్రెస్: ఇక హైదరాబాద్–కన్యాకుమారి స్పెషల్ (07230/07229) రైలును కూడా రెగ్యులర్ సర్వీసులుగా మార్చారు రైల్వే అధికారులు. ఈ రైలు ఇప్పుడు హైదరాబాద్–కన్యాకుమారి ఎక్స్ ప్రెస్ (17069/17070)గా వారానికి ఒకసారి నడుస్తుంది. తెలంగాణ నుంచి దేశంలోని దక్షిణాది చిరవి ప్రాంతమైన కన్యాకుమారికి వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు మంచి సౌకర్యాన్ని అందించనుంది.
⦿ చర్లపల్లి–షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్: అటు చర్లపల్లి–షాలిమార్ స్పెషల్ (07225/07226) రైలును చర్లపల్లి–షాలిమార్ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (17065/17066) గా మార్చారు. ఈ రైలు ప్రతి మంగళవారం ఉదయం చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. బుధవారం పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ చేరుకుంటుంది.
Read Also: సమ్మర్ ట్రావెలర్స్ కు గుడ్ న్యూస్.. 1,484 స్పెషల్ ట్రైన్స్ ప్రకటించిన రైల్వే!
హైదరాబాద్ నుంచి బయల్దేరే రైలు సర్వీసులకు సంబంధించి రైల్వే శాఖ కీలక వివరాలను వెల్లడించింది. 2014 నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి మొత్తం 91 కొత్త రైలు సర్వీసులను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ, చర్లపల్లి లాంటి ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ఈ రైళ్ల రాకపోలకు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇక తాజాగా స్పెషల్ రైళ్లను రెగ్యులర్ సర్వీసులుగా మార్చడంతో, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు ప్రయాణించే వారికి మరింత సౌకర్యం లభిస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల ప్రయాణీకులు ఈ సర్వీసులను ఉపయోగించుకోవాలని సూచించారు.
Read Also: పీక్ సీజన్లో కీలక నిర్ణయం, ఆ రైలుకు అడిషనల్ థర్డ్ ఏసీ కోచ్!