Waitlisted Train Ticket Cancellation: భారతీయ రైల్వే సంస్థ టికెట్ల అమ్మకం పైనే కాదు, రద్దుపైనా భారీగా ఆదాయాన్ని సంపాదిస్తోంది. టికెట్ల క్యాన్సిల్ పైనా ఛార్జీలు వసూళు చేస్తున్నది. కన్ఫార్మ్ టికెట్లు మాత్రమే కాదు, వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ల క్యాన్సిల్ పైనా డబ్బులు వసూలు చేస్తున్నది. వెయిట్ లిస్ట్ టికెట్లు రద్దు చేసినప్పుడు IRCTC రూ. 20+GST క్లర్కేజ్ ఛార్జీని విధిస్తుంది. ఈ విధానంపై చాలా మంది ప్రయాణీకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కన్ఫామ్ టికెట్లకు ఛార్జ్ వసూళు చేయడంలో అర్థం ఉంది. కానీ, వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ల క్యాన్సిలేషన్ మీద రుసుం వసులు చేయడం ఏంటనే విమర్శలు వస్తున్నాయి.
వెయిట్ లిస్టు టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జ్ పై లోక్ సభలో చర్చ
తాజాగా వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ల క్యాన్సిలేషన్ ఛార్జ్ పై లోక్ సభలో సభ్యులు ప్రశ్నలను లేవనెత్తారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి ఈ అంశంపై మాట్లాడారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ని వెయిట్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ మీద ఛార్జీలు విధించడం గురించి ప్రశ్నించారు. రైల్వే సంస్థకు ఈ ఛార్జీని తొలగించాలనే ఆలోచన ఏమైనా ఉన్నదా? అని ప్రశ్నించారు. వెయిటింగ్ లిస్టులో ఉన్న టికెట్ల క్యాన్సిలేషన్ పై ఛార్జ్ విధించడం సరికాదన్నారు. ఈ విషయంపై మరోసారి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
అసలు విషయం చెప్పిన అశ్విని వైష్ణవ్
ఇక విపక్ష ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. భారతీయ రైల్వే సంస్థ వెయిట్ లిస్ట్ టికెట్లపై క్లర్కేజ్ ఛార్జీలను విధిస్తుందని వెల్లడించారు. టికెట్ల క్యాన్సిలేషన్ సహా ఇతరత్రా వచ్చే ఆదాయాన్ని రైల్వే మెయింటెనెన్స్, రైల్వే నెట్ వర్క్ విస్తరణ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన రాతపూర్వక సమాధానం చెప్పారు. “రైల్వే ప్యాసింజర్స్ (టికెట్ల క్యాన్సిలేషన్, ఛార్జీల రీఫండ్) రూల్స్ 2015 ప్రకారం IRCTC వెబ్ సైట్ ద్వారా రద్దు చేయబడిన వాటితో సహా అన్ని వెయిట్ లిస్ట్ టికెట్ల క్యాన్సిలేషన్ పై క్లర్కేజ్ ఛార్జీ విధించబడుతుంది” అని తెలిపారు. అటు ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో కన్ఫామ్ చేయబడిన, RAC టికెట్ల క్యాన్సిలేషన్ కారణంగా ఖాళీగా ఉండే బెర్త్ లకు అనుగుణంగా వెయిట్ లిస్ట్ టిక్కెట్లు జారీ చేయబడతాయని వైష్ణవ్ వివరించారు. వెయిట్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణీకులు అప్గ్రేడేషన్ స్కీమ్ ద్వారా టికెట్లను అప్ గ్రేడ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. లేదంటే VIKALP స్కీమ్ ప్రకారం ఆల్టర్నేటివ్ రైలుకు ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
టికెట్ల క్యాన్సిలేషన్ పై భారీగా ఆదాయం
రైల్వే నిబంధనల ప్రకారం టికెట్లను రద్దు చేసేటప్పుడు ప్రయాణీకుడు రిజర్వేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రైల్వే సంస్థకు టికెట్ల అమ్మకంతో పాటు క్యాన్సిలేషన్ ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతుంది. అయితే, కన్ఫార్మ్ కాని టికెట్ల క్యాన్సిలేషన్ మీద ఛార్జీలు విధించడం ఏంటని చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి.
Read Also: టికెట్లతోనే కాదు.. క్యాన్సలేషన్తో కూడా డబ్బులే డబ్బులు.. ఎంత వస్తుందంటే?