Scenic Train Journeys In India: భారతదేశం సమశీతోష్ణ ప్రదేశం. ఇక్కడ అన్ని రకాల వాతావరణాలు ఉంటాయి. దేశ సరిహద్దుల్లో సముద్రాలు, ఎడారులు, మంచుకొండలు నెలవై ఉన్నాయి. విశాలమైన, వైవిధ్యమైన ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన రైలు ప్రయాణాలు భారత్ లో ఉన్నాయి. తీర ప్రాంతాలు, దట్టమైన అడవులు, మంచు పర్వతాల గుండా వెళ్తూ ప్రయాణీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే: ఈ టాయ్ ట్రైన్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చుకుంది. వెస్ట్ బెంగాల్ లోని జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు ప్రయాణిస్తుంది. అద్భుతమైన పర్వతశ్రేణుల గుండా ఈ ప్రయాణం కొనసాగుతుంది. పచ్చని తేయాకు తోటలు, పొగమంచుతో కప్పబడిన లోయలు, మనోహరమైన హిల్ టౌన్ లు ఆకట్టుకుంటాయి. దేశంలోని అత్యంత సుందరమైన ప్రయాణాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది.
⦿ జమ్మూ మెయిల్: ఈ రైలు జమ్మూ నుంచి ఉధంపూర్ వరకు ప్రయాణిస్తుంది. హిమాలయ శ్రేణుల గుండా వెళ్తూ ఎంతగానో ఆట్టుకుంటుంది. లోతైన లోయలు, గడ్డకట్టే నదులు, దట్టమైన అడవులతో సహా మంత్రముగ్ధులను చేసే ప్రకృతి అందాల నడుమ ప్రయాణిస్తుంది. సొరంగాలు, వంతెనలు, మంచుతో కప్పబడిన శిఖరాల మధ్య పరుగులు తీస్తూ అలరిస్తుంది.
⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే: దీనిని కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. తమిళనాడులోని మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. నీలగిరి మౌంటైన్ రైల్వే 46 కి.మీ పొడవైన సింగిల్ రైల్వే ట్రాక్ ను కలిగి ఉంటుంది. ఈ రైలు 16 సొరంగాలు, 250 వంతెనల గుండా వెళుతుంది. దారిలో ఏకంగా 208 మలుపులు ఉంటాయి. తేయాకు తోటలు, దట్టమైన అడవులు, పశ్చిమ కనుమలను చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
⦿ హిమాలయన్ క్వీన్: ఈ రైలు హిమాచల్ ప్రదేశ్ కల్కా నుంచి సిమ్లా వరకు ఈ రైలు ప్రయాణిస్తుంది. ఈ టాయ్ ట్రైన్ సుమారు 96 కిలోమీటర్ల పొడవును విస్తరించింది. ఈ రైలు మొత్తం 102 సొరంగాలు, 82 వంతెనల గుండా వెళుతుంది. ప్రకృతి అందాల నడుమ కొనసాగుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.
⦿ మాండోవి ఎక్స్ ప్రెస్: ఇది ముంబై నుంచి గోవా వరకు ప్రయాణిస్తుంది. దట్టమైన అడవులు, ఉప్పొంగే జలపాతాలు, కొంకణ్ తీరం వెంబడి అద్భుతమైన నదులను దాటుతూ వెళ్తుంది. పశ్చిమ కనుమల గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. చక్కటి బీచ్ లు, ఉత్సాహభరితమైన పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు ఆకట్టుకుంటాయి.
⦿ బోట్ మెయిల్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు చెన్నై నుంచి రామేశ్వరం వరకు కొనసాగుతుంది. దేశంలోని అత్యంత ప్రత్యేకమైన రైలు ప్రయాణాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు ఐకానిక్ పంబన్ వంతెన మీది నుంచి ప్రయాణిస్తుంది. కొన్నిసార్లు సముద్రపు అలలతో నీటి తుంపరలు రైళ్లో వెళ్లేవారి పై పడుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
⦿ ఐలాండ్ ఎక్స్ ప్రెస్: ఈ రైలు కన్యాకుమారి నుంచి బెంగళూరు వరకు ప్రయాణిస్తుంది. దక్షిణ భారతదేశ ప్రకృతి అందాలు ప్రయాణీకులను మంత్రముగ్ధులను చేస్తాయి. హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం, బంగాళాఖాతం కలిసే కన్యాకుమారి నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం కొండలు, అడవులు, హిట్ టౌన్ల మీదుగా వెళ్తుంది. పశ్చిమ కనుమలు, జలపాతాలు, కాఫీ తోటలు ఆకట్టుకుంటాయి.
⦿ ఎడారి రాణి: ఈ రైలు రాజస్థాన్ లోని జైసల్మేర్ నుంచి జోధ్ పూర్ వరకు ప్రయాణిస్తుంఇ. థార్ ఎడారి మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. బంగారు వర్ణపు ఇసుక దిబ్బలు, శుష్క మైదానాలు, పురాతన కోటలు ఆకట్టుకుంటాయి.
Read Also: ఢిల్లీ నుంచి ఒక్క రోజులో చుట్టేసే అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు, లైఫ్ లో ఒక్కసారైనా వెళ్లాల్సిందే!