Indian Railways: భారతీయ రైల్వే రోజు రోజుకు మరింత అప్ డేట్ అవుతోంది. ఇప్పటికే, సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉండగా, త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ రైళ్లు సుమారు 180 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించనున్నాయి. త్వరలో నీటితో నడిచే హైడ్రోన్ రైలు పట్టాలెక్కబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యంతో ఈ రైలు ఇంజిన్ రూపొందుతోంది. 1200 HP సామర్థ్యంతో ప్రయాణీకులకు అత్యంత వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని అందించబోతోంది. ఈ నేపథ్యంలో మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. కేవలం మూడున్నర గంటల్లో 840 కిలో మీటర్ల దూరాన్ని కంప్లీట్ చేసే బుల్లెట్ రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణం కొనసాగుతుండా, దేశంలోని మరో రెండు కీలక నగరాల మధ్య ఈ రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఢిల్లీ-వారణాసి మధ్య బుల్లెట్ రైలు
దేశ రాజధాని న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య బుల్లెట్ రైలును అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ రెండు నగరాల మధ్య 840 కిలో మీటర్ల దూరం ఉంటుంది. ఈ ప్రయాణం కేవలం మూడున్నర గంటల్లో పూర్తి కానుంది. రెండు నగరాల మధ్య 12 స్టేషన్లు ఉంటాయి. ఈ బుల్లెట్ రైలు ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ నుండి ప్రారంభమై నోయిడా సెక్టార్ 146, జెవార్ విమానాశ్రయం, మధుర, ఆగ్రా, ఎటావా, కన్నౌజ్, లక్నో, రాయ్ బరేలి, ప్రతాప్ గఢ్, ప్రయాగ్ రాజ్, భడోహి మీదుగా ప్రయాణిస్తుంది. వారణాసిలోని మండుదిహ్ స్టేషన్ వరకు కొనసాగుతుంది.
2029 నాటికి అందుబాటులోకి..
ఢిల్లీ-వారణాసి హై-స్పీడ్ రైల్ కారిడార్ (DVHSRC) 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 43,000 కోట్లుగా నిర్ణయించారు. ఢిల్లీ నుంచి వారణాసి వరకు బుల్లెట్ రైలు మార్గం పనులు పూర్తయిన వెంటనే, ప్రతి రోజూ 18 రైళ్లు నడిపించాలని ఇండియన్ రైల్వే నిర్ణయించింది. బుల్లెట్ రైలు ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ప్రతి 47 నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ఢిల్లీ నుంచి వారణాసి వరకు ఉత్తరప్రదేశ్ లోని అనేక నగరాలకు చేరుకోవడం మరింత సులభం అవుతుంది.
Read Also: బుల్లెట్ రైళ్లు ముద్దుపెట్టుకోవడం ఎప్పుడైనా చూశారా? దీనికో కారణం ఉంది!
భూగర్భంలో బుల్లెట్ రైల్వే స్టేషన్
తాజా సమాచారం ప్రకారం ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ దగ్గర బుల్లెట్ రైలు కోసం భూగర్భ స్టేషన్ నిర్మిస్తున్నారు. దీని కోసం 15 కిలో మీటర్ల పొడవైన సొరంగం నిర్మిస్తున్నారు. అటు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అవధ్ క్రాసింగ్ సమీపంలో బుల్లెట్ రైల్వే స్టేషన్ ను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ స్టేషన్ అమౌసి విమానాశ్రయం, చార్బాగ్ రైల్వే స్టేషన్ మధ్య నిర్మించనున్నారు.
Read Also: రైల్వే తత్కాల్, ప్రీమియం తత్కాల్ టికెట్ బుకింగ్ టైమింగ్స్ ఇవే.. చెక్ చేసుకోండి!