భారత్ లో తొలి హైడ్రోజన్ రైలు అందుబాటులోకి రాబోతోంది. మార్చి 31న ఈ రైలును ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. హైడ్రోజన్ శక్తితో నడిచే ఈ రైలు, పర్యావరణ అనుకూల డిజైన్ తో రైల్వే ట్రాన్స్ పోర్ట్ లో విప్లవాత్మక మార్పులకు కారణం కానుంది. హర్యానాలోని జింద్- సోనిపట్ మార్గంలో తొలిసారి ఈ రైలు పరుగులు పెట్టబోతోంది. జీరో కర్బన ఉద్గారాలతో ఈ రైలు తన సేవలను కొనసాగించనుంది.
హైడ్రోజన్ రైలు ప్రత్యేతలు
భారత్ లో అందుబాటులోకి రాబోతున్న హైడ్రోజన్ రైలు బోలెడు ప్రత్యేకతలను కలిగి ఉంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ రూట్, స్పీడ్: తొలి హైడ్రోజన్ రైలు జింద్- సోనిపల్ మార్గంలో నడవనుంది. సుమారు 89 కిలో మీటర్ల పరిధిలో ఈ మార్గం విస్తరించి ఉంది. ఈ రైలు గంటకు 100 కి. మీ గరిష్ట వేగంతో నడవనుంది. ఒక ఫుల్ ట్యాంక్ వాటర్ మీద 1,000 కిలో మీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. ఈ రైలు తక్కువ దూరాలలో ప్రభావితమైన ప్రయాణానికి అనువైన ఎంపికగా మారనుంది.
⦿ ప్రయాణీకుల సామర్థ్యం: త్వరలో అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ రైలు 2,638 మంది ప్రయాణీకులతో ప్రయాణించనుంది. ఇంకా ఎక్కువ మంది కూడా ఇందులో ప్రయాణించే అవకాశం ఉంది.
⦿ ఇంజిన్ పవర్: ఈ రైలు 1,200 HP ఇంజిన్ ను కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇంజిన్. ఈ ఇంజిన్ భారత సాంకేతిక సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
పర్యావరణ, ఆర్థిక ప్రయోజనాలు
హైడ్రోజన్ రైళ్లు గ్రీన్ రైల్వే రవాణాలో ఒక ప్రధాన ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. సంప్రదాయ డీజిల్ లోకోమోటివ్ లకు పూర్తి భిన్నంగా హైడ్రోజన్ రైళ్లు హైడ్రోజన్ ప్యూయెల్ సెల్స్ ద్వారా నడుస్తాయి. వ్యర్థ ఉత్పత్తులుగా నీరు, వేడిని మాత్రమే విడుదల అవుతాయి. కర్బన ఉద్గారాలు, శబ్ద కాలుష్యాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. ఇది దేశంలో స్వచ్ఛమైన రవాణాకు నిదర్శనంగా నిలువనుంది.
హైడ్రోజన్ రైళ్ల వాడకం దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. హైడ్రోజన్ మౌలిక సదుపాయాల కోసం మొదట్లో ఎక్కువ పెట్టుబడి పెట్టినప్పటికీ, దీర్ఘకాలిక ఇంధన పొదుపు, పర్యావరణ ప్రజయోజనాలు ఎంతో లాభం కలిగిస్తాయి. హైడ్రోజన్ రైళ్లు నిశ్శబ్దంగా ఉంటాయి. ప్రయాణీకులకు సున్నితమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.
Read Also: రైలు ప్రయాణంలో మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కోటా, రైల్వే మంత్రి కీలక ప్రకటన!
హైడ్రోజన్ రైలు అభివృద్ధి
రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) భారతీయ హైడ్రోజన్ రైలును రూపొందించింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో దీనిని తయారు చేశారు. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్పై హైడ్రోజన్ ఫ్యూయెల్ క్యాప్సూల్ ను అమర్చడం ద్వారా ఈ రైలు నడవనుంది. ఇప్పటి వరకు జర్మనీ, చైనా, యుకె లాంటి దేశాలలో ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లు నడుస్తుండగా ఇప్పుడు భారత్ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. ఈ రైళ్ల తయారీ కోసం భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2030 నాటికి భారత రైల్వేలను కర్బన ఉద్గారాలు లేని సంస్థగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సంప్రదాయ రైలు రవాణాతో పోలిస్తే శుభ్రమైన రవాణాను అందించడంలో హైడ్రోజన్ రైలు కీలక పాత్ర పోషిస్తుంది.
Read Also: ఇకపై రైళ్లలో ఫుడ్ మెను, రేట్ల లిస్ట్ తప్పనిసరి.. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం!