Hydrogen Trains in India: భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రోజన్తో నడిచే రైళ్లను మరింత విస్తరించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే దేశంలో తొలి హైడ్రోజన్ రైలు కమర్షియల్ సర్వీసులు ప్రారంభించగా, ఇప్పుడు వాటికి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడంపై రైల్వే దృష్టి పెట్టింది. రైళ్ల సంఖ్యను పెంచాలంటే ఇంధన సరఫరా ఖర్చు తగ్గడం చాలా అవసరం. అందుకే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సంస్థల సంఖ్యను పెంచడం, కొనుగోలు ధరను తగ్గించడం లాంటి అంశాలను రైల్వే పరిశీలిస్తోంది.
జూలై మధ్యలో హైడ్రోజన్ రైలు సేవలు ప్రారంభమైన తర్వాత ఆగస్టు ప్రారంభం నాటికి 2,500 కిలోమీటర్లకు పైగా ప్రయాణం పూర్తి చేసింది. దీంతో ఈ కొత్త టెక్నాలజీపై రైల్వే మరింత నమ్మకంతో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. విద్యుదీకరణ చేయడం కష్టంగా ఉండే కొండ ప్రాంతాలు, హెరిటేజ్ రైల్వే మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను ఉపయోగించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 35 హైడ్రోజన్ ఆధారిత రైళ్లను నడపాలని ప్రణాళిక రూపొందించింది.
హైడ్రోజన్ రైళ్ల సంఖ్య పెరగాలంటే ముందుగా ఇంధన ధర తగ్గాల్సి ఉంటుంది. ప్రస్తుతం గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చు ఎక్కువగా ఉండటం ప్రధాన సవాలుగా ఉంది. దీనిని అధిగమించేందుకు మరిన్ని సరఫరాదారులను రంగంలోకి తీసుకురావడంతో పాటు పోటీ పెంచాలని రైల్వే భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, ఎలక్ట్రోలైజర్ తయారీకి ప్రోత్సాహకాలు అందిస్తోంది. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు 2029-30 వరకు రూ.17,490 కోట్ల కేటాయింపులు ఉన్నాయి. దేశంలో ఉత్పత్తిని పెంచడంతో పాటు భవిష్యత్తులో హైడ్రోజన్ ఎగుమతులకు కూడా అవకాశాలు కల్పించడం దీని లక్ష్యం.
2030 నాటికి దేశంలో ఏడాదికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్సాంలోని నుమాలిగఢ్ రిఫైనరీకి గ్రీన్ హైడ్రోజన్ సరఫరా కోసం జరిగిన టెండర్లో కిలోకు రూ.279 ధర నమోదైంది. తక్కువ ధరకు లభించే రీ జెనరేటివ్ విద్యుత్తు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఈ ఖర్చు తగ్గింపుకు సహకరిస్తున్నాయి. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ ధర కిలోకు సుమారు 2 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి.
హైడ్రోజన్ రైలు సాధారణ డీజిల్ రైలుకు భిన్నంగా పనిచేస్తుంది. రైలులో నిల్వ చేసిన హైడ్రోజన్ను ఫ్యూయల్ సెల్లో గాలిలోని ఆక్సిజన్తో కలుపుతారు. ఈ ప్రక్రియ ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్తుతో రైలులోని ట్రాక్షన్ మోటార్లు పనిచేస్తాయి. ఈ ప్రక్రియలో ఇంధనం కాలదు. పొగ, కర్బన ఉద్గారాలు కూడా ఉండవు. నీటి ఆవిరి మాత్రమే బయటకు వస్తుంది. అందుకే హైడ్రోజన్ రైళ్లను పర్యావరణహిత రవాణా మార్గంగా చూస్తున్నారు.
భారత్ రూపొందించిన హైడ్రోజన్ రైలులో రెండు హైడ్రోజన్ డ్రైవింగ్ పవర్ కార్లు ఉన్నాయి. ఒక్కో వ్యవస్థకు సంబంధించిన మొత్తం పవర్ సామర్థ్యం 1,200 కిలోవాట్లుగా ఉంది. లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీలు, హైడ్రోజన్ నిల్వ సిలిండర్లు కూడా ఈ వ్యవస్థకు సపోర్టుగా పనిచేస్తాయి. ప్రపంచంలోని చాలా హైడ్రోజన్ ప్యాసింజర్ రైళ్లలో రెండు, మూడు కోచ్లు మాత్రమే ఉంటాయి. కానీ భారత రైలులో 10 కోచ్లు ఉండటం ప్రత్యేకత. 3,200 HP ప్రొపల్షన్ సిస్టమ్తో ఇది ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలిచింది.
Read Also: రాయగడ–గుంటూరు ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ ఛేంజ్.. ఆగస్టు 24 నుంచి కొత్త వేళలు ఇవే!