IndiGo CEO Pieter Elbers Apology: గత వారం రోజులు ఇండిగోలో కొనసాగుతున్న సంక్షోభం మీద ఆ సంస్థ సీఈవో పీటర్ ఎల్పర్స్ స్పందించారు. తాజా పరిణామాలపై ప్రయాణీకులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత 20 ఏళ్లలో ఇలాంటి ఘోర పరిస్థితి ఎప్పుడూ ఎదురుకాలేదన్న ఆయన.. ఇబ్బందులు పడిన ప్రయాణీకులందరికీ పేరు పేరునా క్షమాపణలు చెప్పారు. భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరకున్నాయని ఇండిగో సీఈవో పీటర్ ఎల్పర్స్ ప్రకటించారు. సంక్షోభం కారణంగా వేలాది మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారని, అందుకు మనస్ఫూర్తిగా క్షమాపణులు చెప్తున్నట్లు ప్రకటించారు. “అత్యవసర పనుల మీద వెళ్లే వేలమంది ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దానికి మేము క్షమాపణ చెప్తున్నాము. ఇక మీదట ఇండిగో విమాన సేవల్లో ఎటువంటి అసౌకర్యం కలిగే ప్రసక్తి ఉండదు. మెరుగైన సేవలు అందించేందుకు ఇండిగో సిబ్బంది అంతా కష్టపడి పని చేస్తున్నారు. ప్రయాణికులే ఇండిగో సంస్థకు ప్రథమ ప్రాధాన్యత. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నాం” అని పీటర్ ఎల్పర్స్ తెలిపారు.
అటు విమాన టికెట్లు బుక్ చేసుకున్న లక్షలాది మంది ప్రయాణీకులకు ఇప్పటికే పూర్తి రీఫండ్ చెల్లించినట్లు పీటర్ ఎల్పర్స్ తెలిపారు. ప్రయాణీకుల బ్యాగేజీని వారి నివాసాలకు చేర్చినట్లు తెలిపారు. మిగిలిన మరికొన్ని బ్యాగేజీలను వారి ఇళ్లకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: ఇండిగోపై యాక్షన్ షురూ, 5% విమానాలను తగ్గించాలని కేంద్రం ఆదేశం!
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమాన సర్వీసులు నడిపిస్తున్నట్లు పీటర్ ఎల్పర్స్ తెలిపారు. “డిసెంబర్ ఐదవ తేదీన 700 ఫ్లైట్లు మాత్రమే నడపగలిగాము. నిన్న, ఈరోజు మొత్తం 18 వందల ఫ్లైట్లను అందుబాటులోకి తెచ్చాం. 138 గమ్య స్థానాలకు ఇండిగో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ పూర్తి సహకారంతో ముందుకు వెళ్తున్నాము. ఈ సంఘటనల నుంచి గుణపాఠం నేర్చుకున్నాం. మరెప్పుడూ ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రయాణీకులకు భద్రతతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం” అని సీఈవో పీటర్స్ ఎల్బర్స్ ప్రయాణీకులకు హామీ ఇచ్చారు.
Read Also: ఇండిగో దొంగ సాకులు? డీజీసీఏ షోకాజ్ నోటీసులకు ఏం సమాధానం ఇచ్చిందంటే?