IRCTC CMD Sanjay Kumar Jain Resign: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC)కు కొత్త బాస్ రాబోతున్నారు. తాజా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన రాజీనామా సమర్పించారు. ఆయన రిజిగ్నేషన్ ను రైల్వేశాఖ ఆమోదించింది. జూలై 20 వరకు ఆయన తన బాధ్యతలను కొనసాగించనున్నారు.
సంజయ్ కుమార్ జైన్ ఫిబ్రవరి 2024లో IRCTC సీఎండీగా బాధ్యతలు స్వీకరించారు. రెండు సంవత్సరాలకు పైగా ఆయన ఈ సంస్థకు నాయకత్వం వహించారు. ఈ కాలంలో సంస్థ పలు కీలక మైలురాళ్లను చేరుకుంది. జైన్ పదవీకాలంలో కేంద్ర ప్రభుత్వం IRCTCకు ఉన్నత హోదాను కల్పించింది. సంస్థను ‘షెడ్యూల్-బి’ నుంచి ‘షెడ్యూల్-ఎ’ కేటగిరీకి, అలాగే ‘మినీ రత్న-II’ నుంచి ‘నవరత్న’ హోదాకు అప్గ్రేడ్ చేసింది. ఈ అభివృద్ధి సంస్థ ప్రతిష్టను మరింత పెంచింది.
ఆయన హయాంలో IRCTC ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రూ.5,215 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది సంస్థ చరిత్రలోనే అత్యధిక ఆదాయంగా నిలిచింది. పర్యాటక రంగంలో కూడా మంచి వృద్ధి నమోదైంది. అదే ఆర్థిక సంవత్సరంలో IRCTC టూరిజం విభాగం ద్వారా రూ.890 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.
రైల్వే మంత్రిత్వ శాఖతో సమన్వయంగా అనేక కొత్త కార్యక్రమాలను కూడా జైన్ అమలు చేశారు. ముఖ్యంగా సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై దృష్టి సారించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగాన్ని పెంచడం కూడా ఆయన పదవీకాలంలోని ముఖ్యమైన నిర్ణయాల్లో ఒకటి. ఏఐ ఆధారిత కెమెరాల ద్వారా బేస్ కిచెన్లను పర్యవేక్షించే వ్యవస్థను ప్రవేశపెట్టారు. అలాగే మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో ఇ-ప్యాంట్రీ సేవలను మరింత విస్తరించి, ప్రయాణికులు ఆన్ లైన్ లో ముందుగానే భోజనం బుక్ చేసుకునే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇ-టికెట్ బుకింగ్ ప్రక్రియను మరింత వినియోగదారులకు అనుకూలంగా మార్చేందుకు కూడా పలు చర్యలు తీసుకున్నారు. టికెట్ బుకింగ్ వ్యవస్థలో సాంకేతిక మార్పులు తీసుకువచ్చి సేవలను మరింత సులభతరం చేసే ప్రయత్నాలు చేపట్టారు.
IRCTCలో చేరకముందు సంజయ్ కుమార్ జైన్ భారతీయ రైల్వేలో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. నార్తర్న్ రైల్వేలో ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ గా, ముంబై సెంట్రల్ రైల్వే డివిజన్ లో డివిజనల్ రైల్వే మేనేజర్గా పనిచేశారు. అదనంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ విభాగంలో జాయింట్ సెక్రటరీగా కూడా సేవలందించారు. జైన్ రాజీనామా అనంతరం IRCTC సీఎండీ పదవికి తాత్కాలికంగా అదనపు బాధ్యతలను ఎవరికీ అప్పగించాలనే విషయంపై రైల్వే మంత్రిత్వ శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలో జారీ చేయనున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
Read Also: IRCTC అదిరిపోయే ఊటీ టూర్ ప్యాకేజీ.. ప్రకృతి ప్రేమికులకు 4 రోజులు పండుగే పండుగ!