Gold Prices: పసిడి వన్నె తగ్గింది. ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం ధరలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. బంగారం ధర లక్షన్నర దాటడంతో ఆ పేరు ఎత్తేందుకు భయపడిన జనాల్లో ఇప్పుడు మళ్లీ ఆశ చిగురిస్తోంది. నిజానికి పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధర పెరుగుతుంది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అసలు బంగారం ధర ఎందుకు తగ్గుతోంది? దాని వెనుక రీజన్స్ ఏంటి?
రూటు మార్చిన పసిడి
నిన్న మొన్నటి వరకు ధరలతో సామాన్యుడికి చుక్కలు చూపించిన పసిడి.. ఇప్పుడు రూటు మార్చింది. అంతర్జాతీయ మార్కెట్లో వారం రోజులుగా బంగారం ధరలు పతనమవుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్ ప్రకారం గడిచిన వారం రోజుల్లో లండన్ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్ 0.8 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర 4వేల 151 డాలర్ల మార్కుకు పడిపోయింది. తాజా పతనంతో, ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు బంగారం ధరలు ఏకంగా 5 శాతం మేర తగ్గాయి. రానున్న వారాల్లోనూ బంగారం ధరలపై ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్లో గోల్డ్ రేట్లు
కొన్నాళ్లుగా తగ్గుతున్న పసిడి ధరలు ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో గోల్డ్ రేట్ తగ్గడంతో కస్టమర్లు సంతోష పడుతున్నారు. అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో గోల్డ్ రేట్లు గంటల వ్యవధిలోనే మారిపోతున్నాయి. హైదరాబాద్లో మార్కెట్లో ప్రస్తుతం 24 క్యారెట్ల తులం బంగారం రేటు లక్షా 44వేల 600 రూపాయలు ఉండగా.. నగల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు లక్షా 32వేల 500లకు తగ్గింది.
Also Read: కేటీఆర్, హరీష్రావులకు ఎందుకంత కడుపుమంట? ఎమ్మెల్యే యెన్నం సంచలన వ్యాఖ్యలు!
డాలర్ల ఆల్ టైమ్ హై రికార్డ్
భారతీయులకు బంగారం కేవలం ఆభరణం కాదు.. అదో ఎమోషన్, అంతకు మించి ఓ బలమైన ఆర్థిక భరోసా. అక్టోబర్ 2022 నుంచి ప్రారంభమైన గోల్డ్ బుల్ రన్ మార్కెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ముఖ్యంగా 2025లో ఏకంగా 65 శాతం బంపర్ రిటర్న్స్ ఇచ్చిన గోల్డ్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఆ జోష్తోనే 2026 జనవరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ రేటు 5,602 డాలర్ల ఆల్-టైమ్ హై రికార్డుకు చేరింది. అయితే, ఫిబ్రవరి చివరలో మొదలైన పశ్చిమాసియా యుద్ధం వల్ల స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్ల కన్ను గోల్డ్పై పడింది. దాంతో పట్టపగ్గాల్లేకుండా దూసుకెళ్లిన పసిడి, సామాన్యుడు గ్రాము బంగారం కొనాలన్నా వణికిపోయే పరిస్థితి తెచ్చింది.
పశ్చిమాసియా సంక్షోభం
పశ్చిమాసియా సంక్షోభం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్లలో నగదు కొరత ఏర్పడింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద ఇన్వెస్టర్లు తమ లాభాలను లాక్ చేసుకోవడానికి బంగారం, వెండి అమ్మడం మొదలుపెట్టారు. ఫలితంగా ఈ నెల 10 నాటికి గోల్డ్ ప్రైస్ ఏకంగా 28 శాతం పతనమైంది. పసిడి ధరలు పడిపోయేందుకు డాలర్ బలపడటం ప్రధాన కారణం. నిజానికి బంగారానికి, అమెరికన్ డాలర్కు ఎప్పుడూ రివర్స్ రిలేషన్ ఉంటుంది. 2025లో 12 శాతం క్షీణించిన డాలర్ ఇండెక్స్, 2026లో మాత్రం అనూహ్యంగా 2.6 శాతానికి పైగా పుంజుకుంది.
వడ్డీల రేట్లు పెంచుతామని హింట్
ఇక యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు మరోసారి వడ్డీ రేట్లు పెంచుతామని హింట్ ఇచ్చారు. ఇది మార్కెట్లో అనిశ్చితిని పెంచి బంగారంపై ఒత్తిడి పెంచింది. అమెరికాలో బాండ్ల రిటర్న్స్ పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు వడ్డీ రాని బంగారం కన్నా మంచి లాభాలిచ్చే బాండ్ల వైపు మళ్లుతున్నారు. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో హార్మూజ్ జలసంధి ఓపెన్ అయింది. క్రూడ్ ఆయిల్ సరఫరా పెరగడంతో చమురు ధరలు 15 శాతం వరకు తగ్గాయి. ఇది బంగారం నుంచి ఇన్వెస్టర్లను ఆయిల్ స్టాక్స్ వైపు మళ్లేలా చేసింది.