Indain Railways Ticket Booking: భారతీయ రైల్వే సంస్థ టికెటింగ్ విధానంలో కీలక మార్పులు చేసింది. రీసెంట్ గా అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్స్ వ్యవధిని 120 రోజుల నుంచి 60 రోజులకు కుదించింది. ఈ నిబంధన నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. నిజమైన ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు రైలు బుకింగ్ల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ను తగ్గించినట్లు రైల్వే సంస్థ వెల్లడించింది. 120 రోజుల వ్యవధితో టికెట్ బుక్ చేసుకున్న వారిలో సుమారు 21 శాతం మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు తెలిపింది. మరో 5 శాతం మంది ప్రయాణీకులు జర్నీ చేయడం లేదని తెలిపింది. అనవసరంగా రైలు బెర్తులను వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతోనే అడ్వాన్స్ డ్ టికెట్ బుకింగ్ వ్యవధిని తగ్గించినట్లు వెల్లడించింది. నిజమైన ప్రయాణీకులకు మెరుగైన సేవలు కలిగించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇకపై అడ్వాన్స్ డ్ టికెట్ బుక్ చేసుకునే వారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని సూచించింది. ఇంతకీ ఆ విషయాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..
టికెట్లు బుక్ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 5 విషయాల
❂విదేశీ పర్యాటకుల కోసం తీసుకొచ్చిన 365 రోజుల ముందస్తు రిజర్వేషన్ వ్యవధిలో ఎలాంటి మార్పులు ఉండవు.
❂ అక్టోబర్ 31, 2024కి ముందు 120 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవధిలో చేసిన బుకింగ్లు చెల్లుబాటు అవుతాయి.
❂ తాజ్ ఎక్స్ ప్రెస్, గోమతి ఎక్స్ ప్రెస్ లాంటి కొన్ని డే టైమ్ నడిచే ఎక్స్ ప్రెస్ రైళ్లు ముందస్తు రిజర్వేషన్ల కోసం తక్కువ సమయ పరిమితులను కలిగి ఉంటాయి.
❂ టిక్కెట్లను రద్దు చేయకపోవడం, ప్రయాణం చేయకపోవడం కారణంగా పెద్ద సంఖ్యలో సీట్లు వేస్ట్ అవుతున్నాయి. కొన్నిసార్లు ఈ సీట్లు అక్రమంగా వినియోగిస్తున్నట్లు రైల్వే సంస్థ గుర్తించింది.
❂ అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ సమయంలో మార్పులు ఇప్పటికి పలుమార్లు చేశారు. 1995-1998లో ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 30 రోజుల కంటే తక్కువగా ఉండేది.
లగేజీ పరిమితికి మించితే జరిమానా తప్పదు
రైల్వే ప్రయాణీకులు నిర్ణీత క్లాస్ కు కొంత పరిమితిలో ఉచితంగా లగేజీ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పరిమితికి మించితే జరిమానా విధించనున్నట్లు తాజాగా రైల్వే సంస్థ వెల్లడించింది. ప్రయాణీకుల లగేజీ వారి ప్రయాణ తరగతికి అనుమతించిన దాని కంటే ఎక్కువగా తీసుకెళ్తే ఫైన్ విధిస్తామని రైల్వే అధికారులు తెలిపారు. “ప్రతి ప్రయాణీకుడు కొంత మొత్తంలో లగేజీని ఛార్జ్ లేకుండా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే.. స్కూటర్లు, సైకిళ్లు వంటి వస్తువులు, 100 సెం.మీ x 100 సెం.మీ x 70 సెం.మీ కంటే ఎక్కువ పరిమాణంలో ఉన్న సామాన్లు ఫ్రీగా తీసుకెళ్లే అవకాశం ఉండదు. రైల్వే స్టేషన్ లోకి అడుగు పెట్టే సమయంలోనే నిర్ణీత పరిమితిలో లగేజీ ఉందో? లేదో? ప్రయాణీకులు సరి చూసుకోవాలి. పరిమితికి మించి లగేజీ తీసుకొస్తే, తప్పకుండా జరిమానా కట్టాల్సి ఉంటుంది. అధిక లగేజీ కారణంగా ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించకూడదు” అని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: ఈ సారి 3 భాషలు కాదు.. ఏకంగా 12 భాషల్లో రైల్వే అనౌన్స్ మెంట్, ఎప్పుడు.. ఎక్కడంటే?