Indian Railways: సీనియర్ సిటిజన్లకు రైలు టికెట్ ఛార్జీలపై 50% రాయితీని అందించే కొత్త విధానాన్ని భారతీయ రైల్వే ప్రకటించిందంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. చాలా మంది ఇది నిజమేనని నమ్ముతున్నారు. అయితే, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో అసలు నిజం ఎంత ఉంది? ఇది నిజంగానే భారతీయ రైల్వే సంస్థ ప్రకటించిందా? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ రాయితీ నిజమేనా?
భారతీయ రైల్వే సంస్థ సీనియర్ సిటిజన్లకు టికెట్ ఛార్జీపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు. COVID-19 చర్యలలో భాగంగా మార్చి 2020లో సీనియర్ సిటిజన్ రాయితీలను భారతీయ రైల్వే నిలిపివేసింది. ఆర్థిక పరిమితుల కారణంగా ఈ రాయితీని మళ్లీ పునరుద్ధరించే ఆలోచన లేదని కేంద్ర ప్రభుత్వం పదేపదే స్పష్టం చేసింది. IRCTC పోర్టల్ కూడా సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ఛార్జీలు వసూలు చేయబడతాయని వెల్లడిస్తూ ఓ ప్రకటన కూడా ప్రచురించింది. 2025-26 కేంద్ర బడ్జెట్ లో ఈ రాయితీలను పునరుద్ధరించడం గురించి ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. సో, ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని అర్థం అవుతోంది.
2020 నుంచే సీనియర్ సిటిజన్లకు రాయితీలు రద్దు
కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో రైళ్లలో సీనియర్ సిటిజన్ రాయితీతో సహా అనేక రాయితీలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీనికి ముందు.. అన్ని మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్లలో 58 ఏళ్లు పైబడిన మహిళలకు టికెట్ ఛార్జీలపై 50% తగ్గింపు అందించే వారు. 60 ఏళ్లు పైబడిన పురుషులకు 40% తగ్గింపును ఇచ్చేవారు. కానీ, 2020 తర్వాత ఈ రాయితీని మళ్లీ అమలు చేస్తున్నట్లు ప్రకటించలేదు.
Read Also: గుడ్ న్యూస్.. ఇక ఆ స్టేషన్లోనూ ఆగనున్న సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ రైలు!
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఏం చెప్పారంటే?
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్.. సీనియర్ సిటిజన్లకు రాయితీలను తిరిగి ప్రవేశపెట్టే ఆలోచన లేదని పార్లమెంటు వేదికగా వెల్లడించారు. తక్కువ టికెట్ ధరల కారణంగా భారత ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ ఖర్చులలో సుమారు 50% సబ్సిడీ ఇస్తుందని, అదే సమయంలో వికలాంగులు, రోగులు, విద్యార్థులకు రాయితీలను అందిస్తుందని చెప్పారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రయాణీకుల ఆదాయంలో తగ్గుదల కారణంగా గణనీయమైన ఆర్థిక భారాన్ని మోయాల్సి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ సిటిజన్లకు రాయితీలను అందించడం సాధ్యం కాదన్నారు. 2025-26 కేంద్ర బడ్జెట్ లో సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై రాయితీలను పునరుద్ధరించే ప్రణాళిక గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు రైలు ఛార్జీలపై రాయితీలను పునరుద్ధరించిందనే వాదన తప్పు.
Read Also: డ్రైవర్ లెస్ మెట్రో రైలు వచ్చేసింది.. దీన్ని తయారు చేసింది మన ఇండియాలోనే!
Read Also: గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలకూ ఓ వందేభారత్ స్లీపర్.. ఏ రూట్లో నడుస్తుందంటే?