King Of Indian Railways: భారతీయ రైల్వేలో ఎన్నో రకాల రైళ్లు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. వందే భారత్ లాంటి ఆధునిక రైళ్లు ఇప్పుడు వేగం, సౌకర్యంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాయి. అయితే, దశాబ్దాలుగా ఓ రైలుకు మాత్రం భారతీయ రైల్వేలో ప్రత్యేక స్థానం ఉంది. వేగం, సౌకర్యం, సేవలు, ప్రతిష్టతో ఆ రైలును చాలామంది ‘రైళ్ల రాజు’ అని పిలుస్తారు. ఇంతకీ ఆ రైలు ఏది? ఎందుకు దానికి ఆపేరు వచ్చింది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
రాజధాని ఎక్స్ ప్రెస్ ను రైళ్ల రారాజుగా పిలుస్తారు. ఈ రైలు ప్రధానంగా న్యూఢిల్లీని దేశంలోని ముఖ్యమైన నగరాలు, రాష్ట్ర రాజధానులతో వేగంగా కలుపుతుంది. ప్రారంభం నుంచే ఇది సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే మెరుగైన సౌకర్యాలను అందించే ప్రీమియం సర్వీసుగా గుర్తింపు పొందింది. ఏసీ కోచ్లు, ప్రయాణికులకు భోజనం, బెడ్ రోల్స్, పరిశుభ్రత, రైల్వే సిబ్బంది అందించే సేవలు ఈ రైలుకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. సుదూర ప్రయాణం చేసినా ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా ఈ సర్వీసును రూపొందించారు.
రాజధాని ఎక్స్ప్రెస్ చరిత్ర 1969లో మొదలైంది. 1969 మార్చి 3న తొలి రాజధాని ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి హౌరా మధ్య తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ సమయంలో న్యూఢిల్లీ, కోల్కతా మధ్య ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించింది. దాదాపు 17 గంటల్లో ఈ రెండు నగరాలను కలిపి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తొలి సర్వీస్కు మంచి ఆదరణ రావడంతో క్రమంగా రాజధాని ఎక్స్ప్రెస్ సేవలను దేశంలోని ఇతర ముఖ్యమైన నగరాలకు కూడా విస్తరించారు.
రాజధాని ఎక్స్ప్రెస్కు పేరు రావడానికి వేగం కూడా ఒక ప్రధాన కారణం. కొన్ని మార్గాల్లో ఈ రైళ్లు గంటకు 130 నుంచి 140 కిలోమీటర్ల వరకు వేగంతో నడిచే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అయితే, వాస్తవ ప్రయాణ వేగం రైల్వే మార్గం, సిగ్నలింగ్, ట్రాఫిక్, నిర్వహణ పరిస్థితులు లాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ, ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకోవడంలో రాజధాని రైళ్లకు ఎప్పటి నుంచో ప్రత్యేక గుర్తింపు ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, గౌహతి లాంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని పలు ముఖ్యమైన గమ్యస్థానాలకు న్యూఢిల్లీ నుంచి రాజధాని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20కి పైగా రాజధాని మార్గాలు ఉన్నట్లు చెబుతారు. ఇవి న్యూఢిల్లీని వివిధ ముఖ్య నగరాలతో కలుపుతున్నాయి.
రాజధాని ఎక్స్ ప్రెస్ తర్వాత శతాబ్ది, దురంతో, తేజస్, మహారాజాస్ ఎక్స్ప్రెస్ లాంటి అనేక ప్రీమియం రైళ్లు భారతీయ రైల్వేలోకి వచ్చాయి. ప్రస్తుతం వందే భారత్ కూడా వేగవంతమైన ఆధునిక రైళ్లలో ఒకటిగా నిలిచింది. అయినప్పటికీ రాజధాని ఎక్స్ ప్రెస్ కు ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది.
Read Also: తెలంగాణలో తొలి రైలు ప్రారంభం ఇక్కడి నుంచే.. ఎన్ని కిలో మీటర్లు ప్రయాణించిందంటే?