NEET PG Quota: నీట్ – పీజీలో ప్రస్తుతం ఉన్న 50 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ)ను 15 శాతానికి తగ్గించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన నీట్-పీజీ పరీక్ష ను పురస్కరించుకొని తెలంగాణకు చెందిన వైద్య విద్యార్థులు, డాక్టర్లు చేసిన ఆందోళనకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డాకు లేఖ రాశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాల వారీగా అనేక కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందని లేఖలో కేంద్ర మంత్రికి తెలిపారు. వైద్య విద్యతో పాటు పీజీ సీట్లను గణనీయంగా పెంచిందని గుర్తుచేశారు. ఈ సీట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రజల నిధులు, ప్రభుత్వ వనరులు వినియోగించబడుతున్నందున వాటిలో అధిక భాగం తెలంగాణ వైద్య విద్యార్థులకు అందుబాటులో ఉండేలా విధానం ఉండాలని కోరారు.
నీట్ యూజీలో 15 శాతం ఆల్ ఇండియా కోటా అమలులో ఉండగా, నీట్ పీజీలో 50 శాతం ఆల్ ఇండియా కోటా ఉండటం సమతుల్యంగా లేదని బోయినపల్లి వినోద్ ఆవేదన వ్యక్తం చేశారు. పీజీలో కూడా ఆల్ ఇండియా కోటాను 15 శాతానికి తగ్గించాలని కేంద్ర మంత్రిని కోరారు. ప్రతి రాష్ట్రం నుంచి ఆల్ ఇండియా కోటాకు ఎన్ని ప్రభుత్వ పీజీ సీట్లు వెళ్తున్నాయి? ఇతర రాష్ట్రాల నుంచి ఎంతమంది విద్యార్థులు సీట్లు పొందుతున్నారు? అనే అంశాలపై రాష్ట్రాల వారీగా పారదర్శకమైన గణాంకాలను విడుదల చేయాలన్నారు.
Also Read: పబ్లిసిటీ పిచ్చి తప్ప ప్రజల కష్టాలు పట్టవా? సీఎం చంద్రబాబుపై బొత్స ఫైర్!
ప్రస్తుత ఆల్ ఇండియా కోటా విధానంపై సమగ్ర సమీక్ష చేయాలని జేపీ నడ్డాను బోయినపల్లి వినోద్ కోరారు. ప్రజా నిధులతో అభివృద్ధి చేస్తున్న వైద్య విద్యా మౌలిక వసతులకు అనుగుణంగా పీజీ సీట్లలో సముచిత వాటా రాష్ట్ర విద్యార్థులకు లభించేలా సమతుల్యమైన సమాఖ్య విధానం అవసరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Also Read: గుంటూరు ల్యాండ్ వివాదం.. చంద్రబాబుకు జోగి రమేష్ ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే ఎంక్వైరీ వేసుకోండి!