Little Iran in India: భారత దేశం విభిన్నమైన ప్రాంతాలు, సంస్కృతులు, ఆచార వ్యవహారాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఈ సువిశాల దేశంలో కోట్లాది మంది ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అనుసరిస్తూ స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అయితే ఇలాంటి దేశంలో ఇరాన్ కూడా ఉందని మీకు తెలుసా? లిటిల్ ఇరాన్ గా గుర్తింపు పొందిన ఆ ప్రాంతంలో ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇరాన్ సంస్కృతిని, అలవాట్లను ఆచరిస్తున్నారు. ఇంతకీ ఆ ఊరు ఏది? దానికి లిటిల్ ఇరాన్ అని పేరు రావడానికి కారణమేంటి? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
బిహార్ లోని కిషన్ గంజ్ ప్రాంతం.. ‘లిటిల్ ఇరాన్’గా గుర్తింపు పొందింది. దీనికి చారిత్రకమైన కారణాలు ఉన్నాయి. చరిత్రకారుల ప్రకారం.. పూర్వం నుంచి భారత్, పర్షియా (ప్రస్తుత ఇరాన్) మధ్య వ్యాపార సంబంధాలు కొనసాగుతూ వస్తున్నాయి. సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు, ముత్యాలు, అమూల్యమైన లోహాలు ఇరుదేశాల మధ్య ప్రధాన వర్తంగా ఉండేవి. దీని కారణంగా మొఘలుల కాలంలో ఎందరో వ్యాపారులు, పర్యటకులు రెండు ప్రాంతాల మధ్య నిత్యం ప్రయాణించేవారు. అలా భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడిన వారి సంతతే నేడు బీహార్లోని కిషన్గంజ్లో నివసిస్తున్న ఇరానీ సమాజం.
కిషన్గంజ్లోని కొన్ని ప్రాంతాలను స్థానికంగా ‘ఇరానీ బస్తీలు’ (Irani Bastis) అని పిలుస్తారు. ప్రత్యేకించి మోతీబాగ్ కర్బలా ప్రాంతంలో ఈ ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఆజాద్ ఇండియా ఫౌండేషన్ వివరాల ప్రకారం.. ఈ సమాజం 1980ల ప్రారంభంలో పూర్ణియా జిల్లా నుండి కిషన్గంజ్కు వలస వచ్చింది. ప్రారంభంలో వీరు గుడారాలు వేసుకుని సంచార జీవితం గడిపారు. జాతరలు, పండుగలలో గుర్రాల వ్యాపారం చేసేవారు. కాలక్రమేణా కత్తులు, గాజు చట్రాలు వంటి వస్తువులను విక్రయిస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం వీరు కోల్కతా, జైపూర్ వంటి ప్రాంతాల నుండి విలువైన రాళ్లను తెప్పించి రత్నాల (Gemstones) వ్యాపారంలో రాణిస్తున్నారు.
ప్రధానంగా షియా ముస్లింలైన ఈ ప్రజలు.. తమను భారతీయులుగానే భావిస్తారు. ఈ దేశ స్థితిగతులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవడమే కాకుండా.. తమ పూర్వీకుల సంస్కృతిని సైతం ఈ ఇరానీ సమాజం కాపాడుకుంటూ వస్తోంది. వీరు పర్షియన్, హిందీ, ఉర్దూల కలయికతో కూడిన ప్రత్యేకమైన భాషను మాట్లాడతారు. వివాహాలను ఎక్కువగా తమ సమాజానికి చెందిన వారినే చేసుకుంటూ ఉంటారు. వీరి వంటకాలు బీహారీ, పర్షియన్ వంటకాల కలయికగా ఉండి అద్భుతంగా ఉంటాయని చెప్పవచ్చు. సుగంధ ద్రవ్యాల సువాసనలతో వీరు చేసే మాంసాహార వంటకాలు.. లోకల్ గా ఎంతో పాపులర్.
Also Read: వరల్డ్ ఫేమస్ వ్యక్తులు.. చనిపోయినా వదల్లేదు.. సమాధులు తవ్వి శరీర భాగాలు ఎత్తుకెళ్లారు!
శతాబ్దాల కాలంగా దేశంలోనే జీవిస్తున్నప్పటికీ.. ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో వీరికి సమస్యలు ఎదురవుతున్నాయి. కిషన్ గంజ్ ప్రాంతంలో ఇరాన్ సమాజానికి చెందిన సుమారు 30 మందిని తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని గతంలో అధికారులు నోటీసులు ఇచ్చారు. తరతరాలుగా ఇక్కడే ఉంటున్నప్పటికీ.. తమ పౌరసత్వాన్ని సందేహించడంతో ఈ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మెుత్తం మీద ఇరాన్ మూలాలు కలిగిన కిషన్ గంజ్ ప్రాంత ప్రజలు.. ఇరానీ సంస్కృతిని కాపాడుకుంటూ భారత్ లో ఎంతోకాలంగా జీవిస్తుండటం గమనార్హం.
Also Read: డీజిల్కు గుడ్బై.. భారత్లో 35 హైడ్రోజన్ రైళ్లు.. వామ్మో.. రైల్వే ప్లాన్ మామూలుగా లేదుగా!