London Railway Station Closed: ఇండియాలో రైల్వే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చిన బ్రిటన్ ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతోంది. ఇండియన్ రైల్వే రోజు రోజు మరింత అభివృద్ధి చెందుతుంటే, లండన్ రైల్వే మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. సరైన సిబ్బంది లేక ఇప్పటికే రైల్వే సర్వీసులను రద్దు చేస్తుండగా, తాజాగా రైల్వే స్టేషన్లను కూడా మూసివేస్తోంది. సరైన సిబ్బంది లేని కారణంగా లండన్ లోని చాన్సరీ లేన్ స్టేషన్ క్లోజ్ చేశారు. ఈ మేరకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు. “సిబ్బంది లేకపోవడం వల్ల లండన్ లోని చాన్సరీ లేన్ స్టేషన్ మూసివేయబడింది. రైలు టికెట్లతో బస్సులలో ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నాం” అని ట్రాన్స్ పోర్ట్ ఫర్ లండన్ (TfL) సంస్థ ప్రకటన చేసింది. రైళ్లలో వెళ్లాలి అనుకున్న ప్రయాణీకులు బస్సులలో జర్నీ మొదలుపెట్టారు.
లండన్ లో రైల్వే సిబ్బంది కొరత!
బ్రిటన్ లోగత కొద్ది కాలంగా రైల్వే సిబ్బంది కొరత ఆ సంస్థపై తీవ్రంగా పడింది. అవసరానికి సరిపడ లోకో పైలెట్లు లేకపోవడంతో ఏకంగా రాత్రిపూట రైల్వే సేవలను రద్దు చేస్తున్నారు అధికారులు. అంతేకాదు, లోకో పైలెట్లను రిక్రూట్ చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అదే సమయంలో లోకో పైలెట్ల రిక్రూట్ మెంట్ వయసును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు కుదించాలని బ్రిటన్ రవాణాశాఖ వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ లో రైల్వే ఉద్యోగాల్లో చేరాలంటే కనీస వయసు 21 ఏండ్లు ఉండాలి. కానీ, లోకో పైలెట్లు అందుబాటులో లేకపోవడంతో రాత్రిపూట ఏకంగా 87 శాతం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం రైల్వే ప్రవేశ వయసును 18 ఏండ్లకు కుదించాలని నిర్ణయించింది. చాలా మంది లోకో పైలెట్లు స్వచ్ఛందంగా అదనపు షిఫ్టులలో పని చేయడానికి మొగ్గు చూపుతున్నారు. లేకపోతే పరిస్థితి మరింత అధ్వాన్నంగా మరిపోయేది. ప్రస్తుతం, బ్రిటిష్ రైలు డ్రైవర్ల సగటు వయస్సు 48 సంవత్సరాలు. వీరిలో 30% మంది 2029 నాటికి పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే రైల్వే అభ్యర్థుల వయసు కుదించాలని బ్రిటన్ రవాణా భావిస్తోంది. గత సంవత్సరం కన్జర్వేటివ్ ప్రభుత్వం నిర్వహించిన డ్రైవర్ల కనీస వయస్సును తగ్గింపు సంప్రదింపులకు ప్రజల నుంచి పాజిటివ్ రియాక్షన్ వచ్చినట్లు వెల్లడించింది.
Read Also: నేరుగా రైలు సీటు దగ్గరికే రాఖీలు, ఐడియా అదిరింది గురూ!
వయసు తగ్గించినా ప్రమాణాల్లో మార్పులు లేవు!
రైల్వే ఉద్యోగుల వయో పరిమితి తగ్గించినప్పటికీ, లోకో పైలెట్లకు సంబంధించి ఉద్యోగ ప్రమాణాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని బ్రిటన్ అధికారులు వెల్లడించారు. పైగా యువ లోకో పైలెట్లు మరింత సమర్థవంతంగా రైలు నడపడంలో ఈజీగా మెళకువలు నేర్చుకునే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి కొత్త ఉద్యోగ, అప్రెంటిస్ షిప్ అవకాశాలు అందుబాటులోకి రావచ్చని బ్రిటన్ రవాణా శాఖ అభిప్రాయపడింది. చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం కాలేజీ చదువులను వదిలేస్తున్నారని, అలాంటి వారు రైల్వే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చని వెల్లడించింది.
Read Also: నీటితో నడిచే రైలు వచ్చేస్తోంది, టికెట్ ధర ఎంతో తెలుసా?