Indian Railways: చలికాలంలో ప్రకృతి అంతా వెండితెరలా మెరిసిపోతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మంచు దుప్పటి పరుచుకోగా, దక్షిణాది రాష్ట్రాల్లో పొగమంచు కనువిందు చేస్తుంది. ఈ సమయంలో రైలు ప్రయాణం చేస్తే మాటల్లో చెప్పలేని మధుర అనుభూతి కలుగుతుంది. రైలు విండో దగ్గర కూర్చొని నేచర్ అందాలను చూస్తూ వెళ్తుంటే ఆహా అనిపిస్తుంది. శీతాకాలంలో చేయాల్సిన అద్భుతమైన రైలు ప్రయాణాల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
⦿ జమ్మూ-బారాముల్లా రైలు
శీతాకాలంలో చేయాల్సిన బెస్ట్ రైలు ప్రయాణాల్లో ఒకటి జమ్మూ-బారాముల్లా ట్రైన్ జర్నీ. మంచు పరుచుకున్న పర్వతాల నడుమ దూసుకెళ్తుంటే చెప్పలేని ఆహ్లాదం కలుగుతుంది. సుమారు 356 కిలో మీటర్ల మేర ఉన్న ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేని అనుభూతులను కలిగిస్తుంది. మంచుతో గడ్డకట్టిన నదుల నుంచి మొదలుకొని, పర్వతాల వరకు కాశ్మీర్ లోయ అందాలను కళ్లకు కడుతుంది. బనిహాల్, కాజిగుండ్ పట్టణాల మీదుగాసాగే ఈ ప్రయాణం మరింత ఆహ్లాదాన్ని అందిస్తుంది.
⦿ కల్కా-సిమ్లా టాయ్ ట్రైన్
శీతాకాలంలో తప్పకుండా చేయాల్సిన రైలు ప్రయాణం కల్కా-సిమ్లా టాయ్ జర్నీ. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ఈ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పొగమంచు పడుతుంటే 102 సొరంగాలు, 864 వంతెనలు పైన్ అడవులు మరింత అందంగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వత శిఖరాల కనువిందు చేస్తాయి. సూర్యకాంతిలో మెరిసే మంచుగడ్డలు మరింత సంతోషాన్ని కలిగిస్తాయి.
⦿ నీలగిరి మౌంటైన్ రైల్వే
దక్షిణాది రాష్ట్రాల్లో శీతాకాలంలో తప్పకుండా చేయాల్సిన రైలు ప్రయాణం ఇది. మెట్టుపాళ్యం నుంచి ఈటీ వరకు కొనసాగే ఈ ప్రయాణం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రయాణంగా గుర్తించిన ఈ రైల్వే జర్నీ.. మంచుపడుతుంటే పచ్చని టీ తోటలు, దట్టమైన అడవుల గుండా ముందుకు సాగుతుంది.
⦿ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే
శీతాకాలంలో ప్రయాణించాల్సిన మరో చక్కటి రైలు ప్రయాణం డార్జిలింగ్ హిమాలయన్ జర్నీ. న్యూ జల్పైగురి నుంచి డార్జిలింగ్ వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ప్రకృతి ప్రేమికులకు మర్చిపోలేను అనుభవాన్ని అందిస్తుంది. పచ్చని తేయాకు తోటలు పొగమంచుతో కప్పబడి మరింత రమణీయంగా కనిపిస్తాయి. మంచుతో కప్పబడిన పర్వతాలు ఆహా అనిపిస్తాయి.
⦿ మాథెరన్ హిల్ రైల్వే
శీతాకాలంలో ముంబై పరిసరాల్లో ఉంటే కచ్చితంగా మాథెరన్ హిల్ రైల్వే జర్నీని అస్సలు మిస్ కాకూడదు. పొగమంచులో మాథెరన్ పచ్చదనం ఎంతగానో ఆకట్టుకుంటుంది. మానసికంగా మరింత ప్రశాంతతను అందిస్తుంది. ఈ రైలు నెమ్మదిగా ముందుకు కదులుతూ పాతకాలపు వైబ్స్ అందిస్తుంది. పశ్చిమ కనుమల్లో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తుంది.
⦿ దక్కన్ ఒడిస్సీ
డెక్కన్ ఒడిస్సీ మహారాష్ట్రలో గొప్ప పర్యటన అనుభూతిని కలిగిస్తుంది. గోవా, అజంతా, ఎల్లోరాలో స్టాప్ లతో ఆకట్టుకుంటుంది. శీతాకాలంలో గోవా బీచ్లు, ఎల్లోరా గుహలు అదరహో అనిపిస్తాయి.
⦿ కాంగ్రా వ్యాలీ రైల్వే
పఠాన్ కోట్ నుంచి మొదలయ్యే ఈ రైలు ప్రయాణం అద్భుతమైన కాంగ్రా వ్యాలీ గుండా కొనసాగుతుంది. ధౌలాధర్ ప్రాంతాలు మంచు దుప్పటిని ధరించి మరింత ఆహ్లాదకర అనుభూతిని కలిగిస్తాయి. లోయలు, నదులు, హిల్ స్టేషన్లు కనువిందు చేస్తాయి.
Read Also: లగ్జరీ సౌకర్యాలు, అతి తక్కువ ఛార్జ్.. దేశంలో అత్యంత చౌకైన ఏసీ రైలు గురించి తెలుసా?