Mumbai Western Railway: రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం, ఒకవేళ టీసీలకు పట్టుబడితే వాదింది తప్పించుకోవడం కొంత మంది ఫ్యాషన్. ఇలాంటి వారికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నది వెస్ట్రన్ రైల్వే. ఇకపై టికెట్ లేకుండా ప్రయాణించే వారిని కటకటాల్లోకి పంపేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. టికెట్ లేకుండా ప్రయాణించడం, జరిమానా చెల్లించకుండా తప్పించుకునే వారిని నేరుగా రైల్వే పోలీసులకు అప్పగించబోతున్నారు. ఇందుకోసం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్లలో ‘ప్రీ కస్టడీ ఏరియా’లను ఏర్పాటు చేసింది. ఇలాంటి వారిని గుర్తించేందుకు టికెట్-చెకింగ్ సిబ్బందికి బాడీ క్యామ్లు అందించారు. ఇవి టికెట్ లేని ప్రయాణీకులకు సంబంధించిన వివరాలను డేటాబేస్లో నమోదు చేస్తాయి. మళ్లీ మళ్లీ ఇదే నేరానికి పాల్పడిన వారిని గుర్తించి అధిక జరిమానాలను విధించేలా ప్లాన్ చేస్తున్నాయి.
గతవారం నుంచి టెస్టింగ్..
వెస్ట్రన్ రైల్వే అధికారులు తీసుకొచ్చిన ప్రీ-కస్టడీ ప్రాంతానికి సంబంధించిన గతవారం నుంచి టెస్టింగ్ మొదలయ్యింది. ఇప్పుడు ముంబైలోని చర్చిగేట్- విరార్- దహాను సబర్బన్ కారిడార్ కు విస్తరించారు. ప్రస్తుతానికి.. ఈ సౌకర్యం విధానం బోరివాలి, అంధేరిలోని ప్రముఖ స్టేషన్లలో అందుబాటులోకి వచ్చింది. కొంతమంది టికెట్ చెకర్లకు బాడీ క్యామ్ లు కూడా అందించారు అధికారులు.
ప్రీ-కస్టడీ ఉద్దేశం ఏంటి?
పలే పదే టికెట్ లేకుండా ప్రయాణించడంతో పాటు టీసీలకు దొరక్కుండా పారిపోయే వారిని పట్టుకోవడమే ప్రీ-కస్టడీ ప్రాంతాల ముఖ్య ఉద్దేశమని వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. “ కొంత మంది ప్రయాణీకులు తరచుగా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తారు. దొరికినా జరిమానా చెల్లించరు. టీసీలతో వాదనకు దిగుతారు. వారి టైమ్ వేస్ట్ చేస్తారు. ఇకపై అలాంటి వారిని రైల్వే సిబ్బంది నేరుగా ప్రీ కస్టడీ ఏరియాలో ఉంచుతారు. అక్కడ వారి నుంచి జరిమానా వసూలు చేస్తారు. మళ్లీ రిపీట్ అయితే, ఏం జరుగుతుందో వివరిస్తారు. వారి వివరాలను డేటా బేస్ లో ఎంట్రీ చేస్తారు. అక్కడ కూడా రైల్వే సిబ్బందితో వాదనకు దిగితే మెమో జారీ చేస్తారు. వెంటే రైల్వే రక్షణ దళానికి అప్పగిస్తారు. వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు” అని వెస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు.
టీసీలకు బాడీక్యామ్ ల అందజేత
అటు ఇప్పటికే పలువురు టీసీలకు బాడీ క్యామ్ లు అందించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. “ప్రస్తుతం కొంతమంది టీసీలకు బాడీ క్యామ్ లు అందించాం. త్వరలో మిగతా వారిందరికీ అందిస్తాం. వీటి ద్వారా టికెట్ లేనివారు మాట్లాడే వీడియోలు రికార్డు అవుతాయి. ఆ తర్వాత, వారి పేరు, మొబైల్ నంబర్ వివరాలను తీసుకుంటారు. ఈ వివరాలు మా డేటాబేస్ లో సేవ్ అవుతాయి. టికెట్ లేకుండా నాలుగు నుంచి ఐదు సార్లు పట్టుబడిన వారిని ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. రైల్వే చట్టం ప్రకారం ఈ ఫుటేజ్ సాక్ష్యంగా తీసుకుని వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: రైలు ఆలస్యమైందనే కోపంతో.. ఏకంగా సొంత రైల్వే సంస్థను పెట్టేశాడు!