మన దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లు ఏవి అనగానే, వందేభారత్, రాజధాని, శతాబ్ది పేర్లు చెప్తారు. కానీ, ప్రస్తుతం భారతీయ రైల్వే పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం దేశంలో అత్యంత వేగవంతమైన రైలు సాంప్రదాయ ఎక్స్ ప్రెస్ కాదు. ఢిల్లీ-మీరట్ రీజినల్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (RRTS) కారిడార్ లో నడుస్తున్న ఆధునిక నమో భారత్. ప్రస్తుతం ఈ రైలు గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైలు కంటే ముందు, 2016లో ప్రారంభించబడిన గతిమాన్ ఎక్స్ ప్రెస్ కూడా ఇంచుమించు ఇదే వేగంతో ప్రయాణించేది. హజ్రత్ నిజాముద్దీన్- ఆగ్రా మధ్య గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించేది. దేశంలోని మొట్టమొదటి సెమీ హై-స్పీడ్ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైళ్లు కూడా ఈ రైళ్ల గరిష్ట వేగానికి సమానంగా ఉన్నాయి. అయితే, జూన్ 24, 2024లో రైల్వేశాఖ ఎలాంటి నిర్దిష్ట కారణాన్ని చెప్పకుండా వందేభాతర్ రైలు గరిష్ట వేగాన్ని 160 కి.మీ. నుంచి 130 కి.మీకి తగ్గించింది. ప్రస్తుతం, భారతీయ రైల్వే నెట్ వర్క్ లోని అన్ని రైళ్లు గరిష్ట వేగ పరిమితి 130 కి.మీతో నడుస్తున్నాయి.
నమో భారత్ రైళ్లు ప్రస్తుతం తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్- ఉత్తరప్రదేశ్ లోని మీరట్ సౌత్ మధ్య 30 నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి రైలుకు ఆరు కోచ్లు ఉన్నాయి. ప్రతి స్టేషన్ నుండి 15 నిమిషాలకో రైలు నడుస్తుంది. మార్గంలోని కొన్ని ప్రాంతాలలో రైళ్లు కొన్ని సెకన్ల పాటు 160 కి.మీ. గరిష్ట వేగాన్ని అందుకుంటున్నాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NCRTC) అధికారుల ప్రకారం, ఈ కారిడార్ ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్- ఉత్తరప్రదేశ్ లోని మోడీపురం వరకు 82.15 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. మార్గం మధ్యలో 16 స్టేషన్లు ఉంటాయి.
ఈ కారిడార్ పూర్తయిన తర్వాత, నమో భారత్ రైళ్లు ఢిల్లీని చారిత్రాత్మక నగరం మీరట్ తో అనుసంధానిస్తున్నాయి. ఈ మార్గంలోని అన్ని స్టేషన్లలో ఆగుతూ ప్రయాణం ఒక గంట కంటే తక్కువ సమయంలో చేరుకుంటుంది. వేగవంతమైన కనెక్టివిటీతో పాటు ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ నుంచి ఉత్తరప్రదేశ్ లోని మోడీపురం వరకు 16 స్టేషన్లతో మొత్తం 82.15 కి.మీ విస్తరించి ఉంటుంది. అయితే, ఈ రైళ్లు ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశంపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తదుపరి ఏ రూట్ లో అందుబాటులోకి తీసుకురావాలి? అనే విషయంలో క్లారిటీ లేదు.