ఇటీవల కాలంలో రైలు ప్రమాదాలకంటే రైళ్లలో దోపిడీ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే వీటిని అరికట్టడంలో రైల్వే పోలీసుల నిర్లక్ష్యం ఇక్కడ ప్రధానంగా విమర్శలకు దారితీస్తోంది. వరుసగా దోపిడీలు జరుగుతుంటే నిఘా పెట్టాల్సిన పోలీస్ వ్యవస్థ నిద్రపోతోంది. దీంతో దోపిడీ దొంగలు పదే పదే రైళ్లను టార్గెట్ చేస్తున్నారు. ప్రయాణికుల విలువైన వస్తువుల్ని దోచుకెళ్తున్నారు.
దురంతో ఎక్స్ప్రెస్ లక్ష్యంగా..
న్యూఢీల్లీ నుంచి భువనేశ్వర్ వెళ్లే దురంతో ఎక్స్ ప్రెస్ ని దోపిడీ దొంగలు వరుసగా రెండుసార్లు టార్గెట్ చేశారు. రెండు నెలల క్రితం కూడా ఇదే రైలులో దొంగలు పడ్డారు. తాజాగా గయ స్టేషన్ సమీపంలో మరోసారి ప్రయాణికుల్ని దోచుకుని వెళ్లారు దొంగలు. ఈ తెల్లవారు ఝామున దొంగతనం జరిగింది. ప్రయాణికుల వద్ద విలువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ సామగ్రి దోచుకున్నారు. మహిళా ప్రయాణికుల వద్ద నగలు, హ్యాండ్ బ్యాగ్ లు లాక్కెళ్లారు. ఈ ఘటనతో వారు షాకయ్యారు. గయ స్టేషన్లో దిగిన ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. తమ వస్తువుల్ని తిరిగి ఇప్పించాలని, వెంటనే దొంగల్ని పట్టుకోవాలని వారు స్టేషన్లో నిరసన చేపట్టారు.
5 కోచ్ లలో దోపిడీ..
గయ ప్రభుత్వ రైల్వే పోలీస్ దళం వెంటనే విచారణ చేపట్టింది. గుర్తు తెలియని దొంగల ముఠా.. దురంతో ఎక్స్ ప్రెస్ లో ఐదు కోచ్లను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రయాణికుల నుంచి బ్యాగ్ లు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు ఇతర వస్తువుల్ని దోచుకుని వెంటనే వారు రైలు దిగి వెళ్లిపోయారు. 12మంది వ్యక్తులకు చెందిన విలువైన వస్తువులు పోయినట్టు పోలీసులకు రిపోర్ట్ చేశారు. ల్యాప్ ట్యాప్ లను టార్గెట్ చేసి మరీ తీసుకెళ్లారని వారు భావిస్తున్నారు. గురువారం రాత్రి దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్ నుండి రైలు బయలుదేరిన తర్వాత కొంతమంది అనుమానిత వ్యక్తుల్ని ప్రయాణికులు గమనించారు. వారు అనుమానాస్పదంగా బోగీల్లో తిరుగుతున్నట్టు గుర్తించారు. వారి గురించి కనీసం కంప్లయింట్ చేద్దామన్నా గస్తీ పోలీసులు కనపడలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. అనుమానితుల సమాచారం పోలీసులకు చెబుదామన్నా వారు అందుబాటులో లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీలో తమ విలువైన వస్తువులు కోల్పోయామని వారు వాపోయారు.
ఇలా పారిపోయారు..
తెల్లవారు ఝామున అందరూ గాఢనిద్రలో ఉన్న టైమ్ లో ఈ దోపిడీ జరిగింది. తెల్లవారు ఝామున 2 గంటలకల్లా దోపిడీ పూర్తి చేసిన దొంగల ముఠా చైన్ లాగి తప్పించుకుంది. దొంగలు చైన్ లాగిన వెంటనే రైలు ఆగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU)-గయ రైల్వే సెక్షన్లోని పరైయా – కాస్తా స్టేషన్ల మధ్య రైలు ఆగింది.రైలు ఆగడంతో దొంగలు తప్పించుకున్నారు. దాదాపు అక్కడే అరగంట సేపు రైలు ఆగింది. దొంగలు అక్కడ్నుంచి తప్పించుకున్నారు. రైలు ఆగిన చోటకు పోలీసులు వెళ్లి చూడగా, అక్కడ ఖాళీ బ్యాగ్ లు కనిపించాయి. వస్తువుల్ని తీసుకెళ్తూ ఖాళీ బ్యాగుల్ని పట్టాల పక్కనే వదిలేసి వెళ్లారు దొంగలు. పోలీసులు విచారణ చేపట్టారు, ఇది పాత ముఠా పనే అని అనుమానిస్తున్నారు.