New York Floods: కుండపోత వర్షాలు, ఆకస్మిక వరదలు న్యూయార్క్ నగరాన్ని ముంచెత్తాయి. న్యూయార్క్ రోడ్లు నదులుగా మారాయి. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షాల కారణంగా రైల్వే ట్రాక్స్ నీళ్లలో మునిగిపోవడంతో కొన్ని రైలు మార్గాలను మూసివేశారు. భీకర వర్షాల నేపథ్యంలో అధికారులు సిటీలో అత్యవసర పరిస్థితి విధించారు. వాషింగ్టన్-బాల్టిమోర్ ప్రాంతం నుంచి ఉత్తరాన ఫిలడెల్ఫియా, విల్మింగ్టన్, డెలావేర్, న్యూవార్క్, న్యూజెర్సీ, న్యూయార్క్ మెట్రోపాలిటన్ ప్రాంతం వరకున్న ఈశాన్య పట్టణ కారిడార్ లోని కొన్ని ప్రాంతాలలో నేషనల్ వెదర్ సర్వీస్ ఆకస్మిక వరద హెచ్చరికలను జారీ చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఆ సంస్థ షేర్ చేసిన వీడియో క్లిప్ లో తీవ్రమైన తుఫాను కారణంగా రైల్వే ట్రాక్స్ నీళ్లలో నిండిపోయి కనిపించాయి.
నదులను తలపించిన రహదారులు
మరొక వీడియోలో న్యూయార్క్ వీధుల్లో గందరగోళ పరిస్థితులు కనిపించాయి. కార్లు, మినీబస్సులు లోతైన నీటిలో మునిగిపోయాయి. పలు రహదారులు నీటితో నిండిపోయాయి. బస్సు కింది డెక్ వరకు నీటితో మునిగిన దృశ్యాలు కలనిపించాయి. స్టేటెన్ ఐలాండ్ లోని మ్యాన్ హోల్ ఉప్పొంగుతూ కనిపించింది. రోడ్లన్నీ నీట మునిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
న్యూయార్క్ మేయర్ కీలక ప్రకటన
అటు న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్.. నగరంలో అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు వెల్లడించారు. “నగర ప్రజలకు ముఖ్యమైన సూచన. ప్రయాణాలపై ఆంక్షలు, వరద పర్యవేక్షణ ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటుంది. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండటం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రైవ్ చేయవద్దు. రహదారులు వరదలతో నిండిపోయాయి. సహాయక సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని ఆయన వెల్లడించారు. అటు బేస్మెంట్ అపార్ట్ మెంట్ లో నివసిస్తున్న ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అవసరం అయితే, అధికారులను సంప్రదించి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిందిగా కోరవచ్చన్నారు.
Read Also: 6 నిమిషాలు.. చీకటి గుప్పిట్లో ప్రపంచం, ఆగష్టు 2న ఏం జరగబోతోందంటే?
రెండు వారాల్లో రెండోసారి వరదలు
న్యూయార్క్ వాసులతో పాటు ఈశాన్య ప్రాంతంలోని లక్షలాది మంది రెండు వారాల్లో రెండవసారి ఆకస్మిక వరదలను ఎదుర్కొన్నారు. మేరీల్యాండ్ లో తుఫాను కారణంగా కాలువలో చిక్కుకుని 13 ఏళ్ల బాలుడు మరణించాడు. స్థానికులు పైపులో చిక్కుకున్న బాలుడిని గమనించారు. కానీ, నీరు చాలా వేగంగా ప్రవహిస్తూ ఉండటం వలన అతడిని పైపులోకి లాగింది. చివరికి వర్షం తగ్గిన తర్వాత, వారు అతన్ని బయటకు తీయగలిగారు. కానీ, అప్పటికే ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ప్రజలకు అధికారులు కీలక సూచనలు చేశారు. ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లలోనే సేఫ్ గా ఉండాలని సూచించారు. బయటకు వచ్చి ఇబ్బందులు పడకూడదని సూచించారు.
Read Also: పాకిస్తాన్ రైళ్లు ఇంత దారుణమా.. ఈ బోగీలను పాత సామాన్లవాడు కూడా కొనడేమో!