Rail Coach Restaurant: మామూలుగా రైల్వే స్టేషన్ కు ఎవరు వెళ్తారు? టికెట్తో ప్రయాణించడానికి, ట్రైన్ ఎక్కడానికి కదా? కానీ ఈ స్టేషన్ వద్దకు మాత్రం ఇప్పుడు ట్రైన్ కోసం కాదు.. తిండి కోసం ప్రజలు పరుగులు పెడుతున్నారు. రైలు కోచ్ రెస్టారెంట్లో రుచుల పండుగ చూస్తున్న జనం.. టికెట్ లేకుండా స్టేషన్కు వచ్చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రయాణికులకు నూతన ఆకర్షణగా మారింది. ఇంతకు ఈ పరిస్థితి ఎక్కడ ఉందో తెలుసుకుందాం.
కోచ్ కాదు.. కిచెన్! రైలు బోగీలో రెస్టారెంట్
పాత రైలు బోగిని చక్కగా మోడిఫై చేసి, రెస్టారెంట్గా మార్చారు. లోపల అడుగు పెట్టగానే ఫుడ్ వాసనలు.. లైట్ల వెలుతురు.. ఏదో థీమ్ కేఫ్లోకి వచ్చామేమో అనిపిస్తుంది. బయట చూస్తే నెర్రగా రైలు కోచ్గానే కనిపిస్తుండగా, లోపల మాత్రం క్లాసీ ఫర్నిచర్, ఏసీ, డిజైన్తో హోటల్ లాగా అనిపిస్తుంది. ఇది వెస్ట్రన్ రైల్వే అందించిన కొత్త ప్రయోగం.
ట్రాక్ పైనే టేస్టీ డైనింగ్
ముంబయి బాంద్రా రైల్వే స్టేషన్లో ప్లాట్ఫాం పక్కనే ఈ కోచ్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశారు. అంటే.. ట్రైన్ పక్కన కూర్చుని టిఫిన్ తినవచ్చు అన్నమాట. చాలా మంది యువత, ట్రావెల్ బ్లాగర్లు ఈ ప్రత్యేకత కోసం ప్రత్యేకంగా వస్తున్నారు. ఇన్స్టాగ్రామ్కు ఫోటోలు తీసేందుకు ఇదే బెస్ట్ లొకేషన్ అంటూ హ్యాష్ట్యాగ్ల వర్షం కురుస్తోంది.
ఈ కొత్త రెస్టారెంట్ను కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాందాస్ అథవాలే, మహారాష్ట్ర ఐటీ, సాంస్కృతిక శాఖ మంత్రి ఆశిష్ షేలార్ కలిసి ప్రారంభించారు. ఇది బాంద్రా స్టేషన్ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. రైల్వే శాఖ ప్రయాణీకులకు మంచి సదుపాయాలు కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలలో ఇది ఒక మైలురాయి.
ట్రైన్ లేకున్నా స్టేషన్కి ఎందుకు వస్తున్నారు?
ఇప్పుడు బాంద్రా స్టేషన్కి కొంత మంది నిజంగా ప్రయాణం కోసం రావడం లేదు. వారిలో చాలామంది ట్రైన్కి సంబంధించిన ఫోటోలు తీయడం, కోచ్ రెస్టారెంట్లో డైనింగ్ చేయడం కోసమే వస్తున్నారు. హైదరాబాదీ బిర్యానీ నుంచి ముంబయి వడపావ్ వరకూ రుచుల పరంపర ఇక్కడ అందుబాటులో ఉంది.
Also Read: Amaravati railway line: అమరావతికి ట్రైన్.. అంతా అనుకున్నట్లే జరిగేనా?
వింతలు – విశేషాలు
రైలు కోచ్ను రెస్టారెంట్గా మార్చిన ఐడియా ఇదే మొదటిది కాదు, కానీ ఇది చాలా స్టైలిష్గా ఉండటంతో వైరల్ అవుతోంది. టికెట్ లేకుండా కూడా స్టేషన్లోకి ప్రవేశించి రెస్టారెంట్కు వెళ్లవచ్చనే ప్రత్యేక అనుమతి ఉంది. రోజు మూడు పూటలా తినే వారి కంటే, సెల్ఫీ తీయడానికి వచ్చే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. శనివారం, ఆదివారాల్లో ఫుల్ బుకింగ్స్తో హోటల్లా ఎదురుచూపులు తప్పవు.
రైల్వేకి ఆదాయం.. ప్రయాణికులకు వినోదం
పాత బోగీలను ఇలా కస్టమైజ్ చేసి రెస్టారెంట్లుగా మార్చడం ద్వారా రైల్వే శాఖకు అదనపు ఆదాయం లభిస్తోంది. పైగా స్టేషన్లో బోర్గా ఉండే టైం కూడా వినోదంగా మారుతోంది. ప్రయాణాల మధ్యలో చిన్న బ్రేక్ కావాలనుకుంటే.. కోచ్ రెస్టారెంట్ బెస్ట్ ఆప్షన్. ఇప్పటికే భోపాల్, ఇంద్రప్రస్థం వంటి స్టేషన్లలో ఇలాంటి రెస్టారెంట్లు ఉన్నాయి. కానీ బాంద్రా రెస్టారెంట్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గణేష్ మహోత్సవం సందర్భంగా ప్రారంభించడం, ఫుడ్ వెరైటీ, కోచ్ డిజైన్ అన్నీ కూడా ఒక స్టైలిష్ కంప్లీట్ ప్యాకేజ్.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఇది రెస్టారెంటా లేక రైలా? అని తేల్చలేని మోడరన్ ప్రయోగం ఇది. ఇకపై బాంద్రా స్టేషన్ వెళ్తే ట్రైన్ మిస్ అయితే ఫరవాలేదు.. కోచ్ రెస్టారెంట్ మిస్ అయితే మాత్రం నిజంగా దెబ్బే. ఇది భవిష్యత్తులో మరిన్ని స్టేషన్లలో ప్రారంభమవుతుందా లేదా అన్నది చూడాలి మరి!