Indian Raiways: సుదూర ప్రయాణాలు చేయాలనుకునే వాళ్లు ముందుగా ఎంచుకునే ఆప్షన్ రైల్వే ప్రయాణం. తక్కువ ఖర్చు, ఆహ్లాదకరంగా జర్నీ చేసే అవకాశం ఉండటంతో ఎక్కువ మంది మొగ్గు చూపుతారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా రైలు ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతారు. ప్రజలను తక్కువ ఖర్చుతో గమ్యస్థానాలను చేర్చేందుకు భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది. ప్రయాణీకులు కొనుగోలు చేసే ప్రతి టికెట్ మీద సబ్సిడీ అందిస్తోంది.
ఒక్కో టికెట్ పై 47 శాతం సబ్సిడీ
సాధారణంగా కిలో మీటర్ రైలు ప్రయాణానికి రూ. 1.38 ఖర్చు కాగా, ప్రయాణీకుల నుంచి కేవలం 73 పైసలు మాత్రమే వసూళు చేస్తున్నది. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో అందిస్తోంది. అంటే, ఒక్కో టికెట్ పై 47 శాతం సబ్సిడీ అందిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణీకులు సబ్సిడీ కోసం రూ. 57, 000 కోట్లు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించారు. 2023-24 ఏడాదికి గాను ఆ సబ్సిడీ సుమారు రూ. 60,000 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. పార్లమెంట్ లో విపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పారు.
‘గివ్ ఇట్ అప్’ పథకాన్ని ప్రారంభించిన కేంద్రప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వే సబ్సిడీల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. అవసరం లేని వాళ్లు ఎల్పీజీ సిలిండర్లపై సబ్సిడీ వదులుకున్నట్లుగానే, రైల్వే టికెట్లపైనా సబ్సిడీ వదులుకోవాలని సూచించారు. ఇందుకోసం ‘గివ్ ఇట్ అప్’ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణీకులు రైలు టికెట్ ను సబ్సిడీతో లేదంటే, సబ్సిడీ లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు చెప్పారు. సబ్సిడీ వదులుకునే వారు ప్రస్తుతం చెల్లించే ధరతో పోల్చితే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
‘గివ్ ఇట్ అప్’ పథకానికి అనుగుణంగా IRCTCలో మార్పులు
సబ్సిడీ వదులుకోవాలని ప్రధాని మోడీ ప్రయాణీకులకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్ప్(IRCTC) వెబ్ సైట్ లో అవసరమైన మార్పులను చేసింది. సబ్సిడీతో పాటు సబ్సిడీ లేకుండా టికెట్ కొనుగోలు చేసే ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సబ్సిడీ వద్దు అనుకునే వాళ్లు ‘గివ్ ఇట్ అప్’ ఆప్షన్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన వాళ్లు యథావిధిగా టికెట్ బుక్ చేసుకోవచ్చు.
పొరుగు దేశాలతో పోల్చితే మన రైలు ప్రయాణం చౌక
ఇక రైల్వే ఛార్జీల విషయంలోనూ భారత్ చాలా బెటర్ గా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలతో పోలిస్తే భారత్ లో రైల్వే ఛార్జీలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. పాశ్చాత్య దేశాలలో రైల్వే ఛార్జీలు భారత్ కంటే 10 నుంచి 20 రెట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన ప్రస్తావించారు. ప్రయాణీకులకు తక్కువ ధరలో మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Read Also: ఓడియమ్మ.. ఈ ఒక్క రైలు సంపాదనే అన్నికోట్లా? ఇది ఏ రూట్లో వెళ్తుందంటే?