Railway Stations Crowd: సంక్రాంతి ప్రయాణాలు జోరందుకున్నాయి. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు సంస్థలు కూడా సెలవులు ప్రకటించడంతో చాలా మంది కుటుంబ సమేతంగా స్వగ్రామాలకు బయల్దేరుతున్నారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి సహా ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రయాణీకులు పోటెత్తారు. రైల్వే స్టేషన్ల ప్రాంగణం జనాలతో కిక్కిరిసిపోయింది. రైళ్లన్నీ జనాలతో నిండిపోయాయి.
కిటకిటలాడిన విశాఖ రైల్వే స్టేషన్
అటు ఏపీలోని విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా జనాలతో కిటకిటలాడింది. విశాఖ నుంచి భువనేశ్వర్, విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, చెన్నై వైపు వెళ్లే ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లతో పాటు విజయనగరం, పార్వతీపురం, శ్రీకాకుళం, పలాస, నౌపడ, రాయగడ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లే పాసింజర్ రైళ్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. అదే సమయంలో ఇతర ప్రాంతాల నుంచి విశాఖ, విజయనగరం చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చేవారితో రైల్వే స్టేషన్ కిటకిటలాడింది.
వైజాన్ నుంచి బయలుదేరిన రైళ్లతో పాటు, ఇతర ప్రాంతాల నుంచి విశాఖ మీదుగా నడిచిన రైళ్లు ప్రయాణీకులతో పోటెత్తాయి. గుంటూరు, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రాయగడ, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతూ వచ్చాయి. అలాగే విశాఖ నుంచి విజయవాడ, సికింద్రాబాద్, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లే జన్మభూమి, సింహాద్రి, రత్నాచల్, విశాఖ, తిరుమల, గోదావరి, గరీబ్ రధ్, ఎల్టీటీ, మహబూబ్నగర్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు కాలు పెట్టేందుకు సందు లేనంతమంది ప్రయాణీకులతో వెళ్లాయి.
పాసింజర్ రైళ్లకూ జనాల తాడికి
ఇక విశాఖపట్నం నుంచి కొత్తవలస, విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, చీపురుపల్లి, పొందూరు, శ్రీకాకుళం రోడ్డు, తిలారు, కోటబొమ్మాలి, నౌపడా, పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురం వంటి ప్రాంతాలకు వెళ్లే జనాలు చాలా మంది రైళ్లలో వెళ్లేందుకు మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ, గుంటూరు- రాయగడ ఎక్స్ ప్రెస్, రైళ్లతోపాటు విశాఖ-భవానీపట్నం, విశాఖ-బ్రహ్మపూర్, విశాఖ-పార్వతీపురం పాసింజర్, విశాఖ-కోరాపుట్, విశాఖ-గునుపూర్, విశాఖ-రాయపూర్ ప్యాసింజర్ రైళ్లు ప్రయాణీకులతో కిటకిటలాడాయి.
ఇవాళ సింహాద్రి ఎక్ప్ ప్రెస్ రద్దు
పండుగ వేళ సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలును రద్దు చేయడం పట్ల ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ డివిజన్ లో జరుగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారనంగా విశాఖ నుంచి గుంటూరు వెళ్లే సింహాద్రి ఎక్స్ ప్రెస్ రైలును ఇవాళ(ఆదివారం) రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావం జన్మభూమి, రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైళ్ల మీద పడనుంది. ఆదివారం ఉదయం 8.00 గంటలకు విశాఖ నుంచి చర్లపల్లికి ప్రత్యేక జన సాధారణ్ రైలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రయాణీకులకు కొంత ఊరట కలిగే అవకాశం ఉంది.
టికెట్ కౌంటర్ల దగ్గర ప్రయాణీకుల పడిగాపులు
ఇక రిజర్వేషన్లు లేని వారు టిక్కెట్లకోసం రైల్వేస్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. టికెట్ల కోసం క్యూలైన్లలో చాలా సేపు నిల్చోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. కరెంట్ రిజర్వేషన్ల కోసం కూడా చాలామంది క్యూ కట్టారు. తత్కాల్ టిక్కెట్ల కోసం కూడా పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు వచ్చారు. రాష్ట్రంలోని అన్ని మార్గాల వైపు ఈనెల 18 వరకు రాను పోను బెర్తులన్నీ నిండిపోయాయని రైల్వే అధికారులు చెప్తున్నారు.
Read Also: మళ్లీ తత్కాల్ బుకింగ్ టైమ్ లో IRCTC సైట్ క్రాష్, సంక్రాంతి వేళ పెద్ద స్కామ్?