Train Ticket Bbooking: మరికొద్ది రోజుల్లో ఉత్తర ప్రదేశ్ లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. నిత్యం లక్షలాది మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. కుంభమేళా జరిగే ప్రయాగరాజ్ రైల్వే స్టేషన్ లో పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. రైలు టికెట్ బుక్ చేసుకునేందుకు భక్తులకు కష్టపడకుండా వర్చువల్ బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇంతకీ వర్చువల్ టికెట్ బుకింగ్ అంటే ఏంటి?
ప్రయాణీకుల సంఖ్య ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో రైల్వేశాఖ వాలంటీర్ల కోసం క్యూఆర్ స్కానర్లతో కూడిన జాకెట్లు, టీషర్ట్ లను అందివ్వనుంది. వీటి మీద ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి ఈజీగా టికెట్ బుక్ చేసుకునేలా అవకాశం కల్పిస్తున్నది. “మహా కుంభమేళాకు వచ్చే భక్తులు రైలు టికెట్లు పొందేందుకు ఇబ్బంది పడకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. రైల్వే వాలంటీర్లు ధరించిన టీషర్టులు, జాకెట్ల మీద ఉన్న QR కోడ్ని స్కాన్ చేసుకుని, మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. క్యూలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా అన్రిజర్వ్ డ్ టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఈ కోడ్ స్కానర్ ఉపయోగపడుతుంది” అని అధికారులు తెలిపారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్చువల్ టికెట్ల బుకింగ్ అనేది టికెట్ కౌంట్లర్ల మీద ఒత్తిడిని తగ్గించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానం ద్వారా రోజుకు 10 లక్షల డిజిటల్ టికెట్లను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
భక్తుల కోసం ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ ల ఏర్పాటు
మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం రైల్వేశాఖ పలు ఏర్పాట్లు చేస్తున్నది. రైళ్లు, గెస్ట్ హౌస్లు, హెల్ప్ లైన్ నంబర్లకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు ‘మహాకుంభ్ రైల్ సేవా 2025’ యాప్, వెబ్ పోర్టల్ ను ప్రారంభించింది. ప్రయాగ్ రాజ్ లో 1.3 లక్షల మంది భక్తులకు వసతి కల్పించే లక్ష్యంతో 28 అతిథి గృహాలను ఏర్పాటు చేసింది.
సుమారు 15 భాషల్లో రైల్వే అనౌన్స్ మెంట్స్
ఇక మహా కుంభమేళా వివరాలను తెలుసుకునేందుకు రైల్వే సంస్థ టోల్ ఫ్రీ నంబర్ 1800-4199-139ను యాక్టివేట్ చేసింది. జనవరి 1 నుంచి ఈ హెల్ప్ లైన్ తెలుగు, తమిళం, మరాఠీ, ఒడియా, బెంగాలీతో సహా వివిధ భాషలలో ఈ కాల్ సెంటర్ పని చేయనుంది. మహా కుంభమేళాకు దేశ వ్యాప్తంగా ఉన్న భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమారు 15 భాషల్లో రైల్వే ప్రకటనలు చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళం, కన్నడ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, బెంగాలీ, ఒడియా, పంజాబీ, అస్సామీ సహా ఇతర భాషలలో అనౌన్స్ మెంట్స్ ఇవ్వనున్నారు. ఇక మహా కుంభమేళా కోసం రైల్వే సంస్థ మొత్తం 13 వేల రైళ్లను అందుబాటులోకి తేనుంది. వాటిలో 10 వేల సాధారణ రైళ్లు ఉండగా, 3 వేల ప్రత్యేక రైళ్లు ఉన్నాయి.
Read Also: దేశంలో ఎక్కువ దూరం నాన్ స్టాప్ గా వెళ్లే రైలు.. ఎక్కడా ఆగే ముచ్చటే లేదు!