Golconda Tunnel: హైదరాబాద్లోని చారిత్రక గోల్కొండ కోట పరిధిలో ఒక రహస్య సొరంగం వెలుగుచూడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోటలోని పటాన్ చెరు దర్వాజా సమీపంలో ఉన్న ‘అఠారా సీడీ’ (18 మెట్లు) ప్రాంతంలో చిన్న గుహలాంటి ఈ నిర్మాణం బయటపడింది. అయితే భారత ఆర్మీ దళాలు ఇక్కడ అక్రమంగా తవ్వకాలు జరిపాయని స్థానిక ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ (Kausar Mohiuddin) ఆరోపించారు. ఈ విషయంపై ఆయన ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారులకు ఫిర్యాదు సైతం చేశారు.
గోల్కొండ కోటలోని ప్రధాన రాజభవనం (బాలా హిసార్), నయా ఖిలా ప్రాంతాలు మాత్రమే ఆర్కియాలజీ పూర్తి పర్యవేక్షణలో ఉన్నాయి. కోటలోని మిగిలిన ద్వారాలు, పరిసర ప్రాంతాలు సంరక్షణ లేక నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఇదిలా ఉంటే పటాన్ చెరు దర్వాజా పరిసర ప్రాంతం పాక్షికంగా భారత ఆర్మీ ఆధీనంలో ఉంది. ఆ ప్రాంతంలోకి స్థానికులు రాకుండా ఆర్మీ బలగాలు పహారా కాస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆర్మీ తవ్వకాలు జరిపిన స్థలం ఒక ఖాళీ మైదానమని, దానిని స్థానికులు శ్మశానవాటికగా వాడుకుంటున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
MYSTERY TUNNEL at 500-year-old Golconda Fort!
Excavation at 18 Seedi uncovers a tunnel on the outer fortification.
Locals are thronging the site. ASI inspection on today.
The land itself is disputed — Army vs locals who use it for burials & cricket. pic.twitter.com/bJk5BxVAhu
— Rajat Jain (@RajatJain) August 21, 2026
మరోవైపు బయటపడ్డ నిర్మాణాన్ని సొరంగంగా పరిగణించవచ్చా? లేదా? అన్నది తేల్చేందుకు పురావస్తు నిపుణులను రంగంలోకి దింపినట్లు ఏఎస్ఐ ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఆ స్థలం ఏఎస్ఐ పరిధిలోకి వస్తుందా? లేక ఆర్మీ పరిధిలోకి వస్తుందా? అనే దానిపై కూడా స్పష్టత రావలసి ఉంది. నిజానికి గోల్కొండ నుంచి చార్మినార్ వరకు రహస్య సొరంగాలు ఉన్నాయని ప్రచారంలో ఉన్నప్పటికీ నిపుణులు దీనిని కొట్టిపారేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న రాతి నేల స్వభావం వల్ల ఆ కాలంలో సొరంగాలు తవ్వడం అసాధ్యమని చరిత్రకారులు చెబుతున్నారు.
గోల్కొండ కోట చారిత్రక నేపథ్యం 14వ శతాబ్దానికి చెందినది. వరంగల్ కాకతీయ రాజు ప్రతాపరుద్రుని కాలంలో ఇది ఒక మట్టి కోటగా నిర్మించబడింది. ఆ తర్వాత 1358-1375 మధ్య బహుమనీ సుల్తానుల చేతుల్లోకి వెళ్లింది. 1518లో కుతుబ్ షాహీ వంశ వ్యవస్థాపకుడు సుల్తాన్ కులీ దీనిని భారీ రాతి కోటగా అభివృద్ధి చేశారు. తెలుగులోని ‘గొల్ల కొండ’ (మేకల కాపరుల కొండ) అనే పేరు నుంచే గోల్కొండ అనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నారు.
Also Read: పాకిస్థాన్ గాడిదలను.. ఎగబడి కొంటున్న చైనా.. ఎందుకో తెలిస్తే షాకే!
గోల్కొండ కోటకు మొత్తం 87 బురుజులు, 8 ప్రధాన ద్వారాలు ఉన్నాయి. దక్కన్ పీఠభూమిలోనే అత్యంత బలమైన కోటగా పేరుగాంచిన గోల్కొండను జయించడానికి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సైన్యం ఏకంగా ఎనిమిది నెలల పాటు వేచి చూడాల్సి వచ్చింది. చివరికి 1687లో ఔరంగజేబు ఈ కోటను వశం చేసుకున్నారు.
Also Read: Jio రూ.299 vs Airtel రూ.349.. రెండిటిలో ఏ ప్లాన్ బెస్ట్.. దేనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ?