Shin Chan Meets Indian Railways: భారతీయ రైల్వేలో మరో క్రేజీ రైలు అందుబాటులోకి వచ్చింది. తరచుగా రకరకాల థీమ్స్ తో ప్రయాణికులను అలరించే ఇండియన్ రైల్వే.. తాజాగా మరో క్రేజీ థీమ్ తో ఎక్స్ ప్రెస్ రైలును తీర్చిదిద్దారు. కొత్త రూపంలో శబరి ఎక్స్ ప్రెస్ అందరి మనసులు దోచుకుంటోంది. దక్షిణ భారతంలోని ప్రముఖ రైళ్లలో ఒకటైన శబరి ఎక్స్ ప్రెస్ కు తాజాగా షిన్ చాన్ థీమ్తో స్పెషల్ ర్యాప్ ను ఏర్పాటు చేశారు. జపాన్కు చెందిన ప్రముఖ యానిమేషన్ పాత్ర షిన్ చాన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ కార్టూన్ ను ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అదే షిన్ చాన్ బొమ్మలతో అలంకరించిన శబరి ఎక్స్ ప్రెస్ స్టేషన్లలో ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ రైలు కేరళ, తెలంగాణ రాష్ట్రాలను కలుపుతూ నిత్యం వేలాది మంది ప్రయాణికులకు సేవలు అందిస్తోంది. అయితే, కొత్తగా చేసిన ఈ రంగురంగుల డిజైన్ తో శబరి ఎక్స్ ప్రెస్ కు మరింత క్రేజీ లుక్ వచ్చింది. రైలు బోగీలపై షిన్ చాన్ పాత్రతో పాటు పలు ఆకర్షణీయమైన చిత్రాలను ముద్రించారు. ఈ రైలు సాధారణ ప్రయాణికులనే కాకుండా చిన్నారులను కూడా ఎంతో ఆకట్టుకుంటోంది.
రైలును చూసిన ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. షిన్ చాన్ థీమ్ తో ఉన్న ఈ రైలు చిత్రాలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారాయి. చాలా మంది నెటిజన్లు భారతీయ రైల్వేలో ఇటీవల కాలంలో కనిపించిన అత్యంత అందమైన రైలు అలంకరణల్లో ఇది ఒకటని ప్రశంసిస్తున్నారు. ప్రత్యేక థీమ్లతో రైళ్లను అలంకరించడం కొత్త విషయం కాకపోయినా, ప్రముఖ యానిమేషన్ పాత్రను ఉపయోగించడం వల్ల ఈ రైలుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా పిల్లలు, యువత ఈ రైలుపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు.
శబరి ఎక్స్ ప్రెస్ కు ఇచ్చిన ఈ కొత్త లుక్ ప్రయాణాన్ని మరింత ఆసక్తికరంగా మార్చిందని ప్రయాణికులు చెబుతున్నారు. రైలు స్టేషన్ లోకి వచ్చినప్పుడల్లా చాలా మంది దానిని చూసేందుకు, ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా రైళ్లు కేవలం ప్రయాణ సాధనాలుగా మాత్రమే కనిపిస్తాయి. కానీ, ఇలాంటి క్రియేటివ్ మేకోవర్స్ ప్రజల్లో ఆనందాన్ని పంచడమే కాకుండా, రైల్వేపై మరింత ఆసక్తిని పెంచుతాయి. షిన్ చాన్ థీమ్ తో అలంకరించిన శబరి ఎక్స్ ప్రెస్ ఇప్పుడు కేవలం ఒక రైలు మాత్రమే కాదు, ఇండియన్ రైల్వేలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ రైల్వేలో ఇలాంటి వినూత్న ప్రయత్నాలు భవిష్యత్తులో మరిన్ని రైళ్లలో కూడా కనిపించాలని ప్రయాణికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: ప్రయాణికుడికి ఇచ్చిన బిర్యానీలో ఈగ.. రైల్వే క్యాటరింగ్ సంస్థకు షాక్!