Snow Leopard Safari in Ladakh: లడఖ్కు వెళ్లే పర్యాటకులకు మరో క్రేజీ ఎక్స్ పీరియెన్స్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే తొలిసారిగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో వన్యప్రాణి సఫారీని ప్రారంభించేందుకు లడఖ్ రెడీ అవుతోంది. ముఖ్యంగా మంచు చిరుతలను దగ్గరగా చూడటంతో పాటు, అక్కడి అరుదైన పక్షులను వీక్షించే అవకాశం ఈ సఫారీ ద్వారా కల్పించనున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదం తెలిపారు. వన్యప్రాణులను కాపాడుతూనే పర్యాటకులకు మంచి అనుభూతిని అందించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. అదే సమయంలో స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ఈ సఫారీ ఉపయోగపడనుంది.
లడఖ్ లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో శిక్షణ పొందిన స్థానిక డ్రైవర్లు, గైడ్లతో కలిసి ఈ సఫారీ నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓపెన్ బ్యాక్ వాహనాలను ఉపయోగించనున్నారు. సందర్శకులను వన్యప్రాణుల ఆవాసాల్లోకి తీసుకెళ్లేటప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. ప్రైవేట్ వాహనాలతో ఇష్టానుసారం ఆఫ్ రోడింగ్ చేయడం వల్ల పర్యావరణానికి, జంతువులకు నష్టం కలిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో నిర్ణయించిన మార్గాల్లోనే సఫారీ నిర్వహించడం ద్వారా వన్యప్రాణుల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
లడఖ్లోని పలు ప్రముఖ వన్యప్రాణి ప్రాంతాల్లో సఫారీ మార్గాలను గుర్తించాలని అటవీ శాఖను ఆదేశించారు. హేమిస్ నేషనల్ పార్క్, చాంగ్తాంగ్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతం, కారకోరం వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంతో పాటు నుబ్రా, జాన్స్కార్, షామ్, కార్గిల్, ద్రాస్ ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతాలు మంచు చిరుతలతో పాటు అనేక రకాల పక్షులకు ప్రసిద్ధి చెందాయి. అందువల్ల ప్రకృతి, వన్యప్రాణుల ఫొటోగ్రఫీపై ఆసక్తి ఉన్నవారికి ఈ సఫారీ ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది.
మంచు చిరుతలను చూడాలనుకునే వారికి లడఖ్ ఇప్పటికే ప్రముఖ డెస్టినేషన్ గా ఉంది. అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం లడఖ్లో సుమారు 477 మంచు చిరుతలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మంచు చిరుతల సంఖ్యతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. మంచు చిరుతలతో పాటు లడఖ్లో 38కు పైగా క్షీరద జాతులు, దాదాపు 340 పక్షి జాతులు, సుమారు 1,800 రకాల పుష్పించే మొక్కలు ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం జీవవైవిధ్య పరంగా ఎంతో ప్రత్యేకమైనదిగా నిలుస్తోంది.
ఈ కార్యక్రమంలో స్థానికులకు కూడా కీలక పాత్ర ఇవ్వనున్నారు. 20 మంది స్థానిక యువతను ఎంపిక చేసి పక్షులను గుర్తించడం, వాటిని పరిశీలించడం, పర్యాటకులకు వాటి గురించి వివరించడం లాంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. సఫారీతో పాటు లడఖ్లో పర్యావరణ పరిరక్షణకు మరిన్ని కార్యక్రమాలను కూడా చేపట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వైల్డ్ లైఫ్ క్లబ్ లను ఏర్పాటు చేసి, విద్యార్థులకు ప్రకృతి, వన్యప్రాణులపై అవగాహన కల్పించనున్నారు. అలాగే స్థానిక యువత కోసం వన్యప్రాణి ఫొటోగ్రఫీ ఫెలోషిప్లు, అవగాహన బోర్డులు ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహిళా కళాకారులకు మంచు చిరుత, నల్లమెడ కొంగ వంటి వన్యప్రాణుల నమూనాలను తయారు చేసే శిక్షణ ఇచ్చి, వాటిని సావనీర్ లుగా అమ్మే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.
Read Also: జంగిల్ సఫారీకి రెడీనా? అయితే, మీ కోసమే IRCTC క్రేజీ టూర్ ప్యాకేజీ రెడీ!