Ice Stupas in Ladakh: ఉత్తర భారతం లోని లడఖ్ ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటోంది. మంచు పర్వతాల మధ్య ఉన్న ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. ఏడాదికి సగటున 100 మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువ వర్షం పడుతుంది. అయినప్పటికీ, అక్కడి ప్రజలు వ్యవసాయంపైనే ఎక్కువగా ఆధారపడతారు.
బార్లీ, ఆపిల్ లాంటి పంటలు పండించడానికి నీరు చాలా అవసరం. అయితే, ఇక్కడ ఓ పెద్ద సమస్య ఉంది. పర్వతాలపై ఉన్న సహజ మంచు నదులు వేసవికాలంలోనే కరగడం ప్రారంభిస్తాయి. కానీ, రైతులు వసంతకాలంలోనే విత్తనాలు వేయాలి. దీంతో అవసరమైన సమయంలో నీరు అందక పంటలు నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది. వాతావరణ మార్పులు కూడా ఈ సమస్యను మరింత పెంచాయి. మంచు నదులు వేగంగా కరిగిపోవడం, వర్షాలు సరిగా పడకపోవడం వల్ల తాగునీరు, సాగునీరు కొరత ఏర్పడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో లడఖ్ కు చెందిన ఇంజనీర్, పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ సరికొత్త ఆలోచన చేశారు. ఆయన రూపొందించిన ఈ ప్రత్యేక పద్ధతిని ‘మంచు స్థూపం’ లేదంటే ‘ఐస్ స్టూపం’ అని పిలుస్తారు. ఈ ఆలోచన వెనుక టెక్నాలజీ ఏమీ లేదు. కాస్త కామన్ సెన్స్ ఉపయోగించారు. చలికాలంలో ఉపయోగం లేకుండా వృథాగా ప్రవహించే నీటిని నిల్వ చేసి, వసంతకాలంలో రైతులకు అందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించారు. దీనికోసం పర్వత ప్రాంతాల నుంచి వచ్చే నీటిని పైపుల ద్వారా గ్రామాల దగ్గరకు తీసుకొస్తారు. లడఖ్ లో ఉండే తీవ్రమైన చలికి ఆ నీరు గడ్డకట్టి మంచుగా మారుతుంది. క్రమంగా అది స్థూపం ఆకారంలో ఉన్న పెద్ద మంచు గోపురంలా తయారవుతుంది. కొన్ని మంచు స్థూపాలు 20 మీటర్లకుపైగా ఎత్తు కూడా పెరుగుతాయి. ఈ శంఖాకారం వెనుక కూడా శాస్త్రీయ కారణం ఉంది. ఈ ఆకారంలో సూర్యరశ్మి తాకే ఉపరితలం తక్కువగా ఉంటుంది. అందువల్ల మంచు చాలా నెమ్మదిగా కరుగుతుంది. ఫలితంగా వసంతకాలం వరకు నీరు నిల్వ ఉండి, రైతులకు అవసరమైన సమయంలో అందుబాటులోకి వస్తుంది.
2014లో నిర్మించిన తొలి మంచు స్థూపం సుమారు 1.5 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసింది. ఆ తర్వాత నిర్మించిన పెద్ద స్థూపాలు 15 లక్షల లీటర్లకుపైగా నీటిని నిల్వ చేశాయి. ఈ నీటితో వేలాది మొక్కలకు నీరందించారు. ఇప్పటి వరకు లడఖ్ లో డజన్ల కొద్ది మంచు స్థూపాలను నిర్మించారు. వీటి ద్వారా కోట్ల లీటర్ల నీరు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
సోనమ్ వాంగ్ చుక్ చేసిన ఈ వినూత్న ప్రయోగానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. 2016లో ఆయనకు అంతర్జాతీయ స్థాయి పురస్కారం కూడా లభించింది. అత్యాధునిక సాంకేతికత లేకుండా, చాలా తక్కువ ఖర్చుతో ప్రకృతితో కలిసి పనిచేస్తే పెద్ద సమస్యలకు పరిష్కారాలు కనుక్కునే అవకాశం ఉందని ‘మంచు స్థూపం’ ప్రపంచానికి నిరూపించింది. నీటి ఎద్దడితో బాధపడుతున్న పర్వత ప్రాంతాలకు ఇదో రోల్ మోడల్ గా నిలిచింది.
Read Also: సైన్స్ కే సవాల్ విసిరే 5 అద్భుత ప్రదేశాలు.. చూస్తే ఆశ్చర్యపోతారు!