Bengaluru Mumbai Vande Bharat Sleeper: దేశంలో మరో వందేభారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి రాబోతోంది. బెంగళూరు- ముంబై మార్గంలో ఈ కొత్త రైలు పరుగులు తీయబోతోంది. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు దక్షిణ పశ్చిమ రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ఈ రైలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం దాదాపు 24 గంటలు పడుతున్న ప్రయాణ సమయం సుమారు 16 గంటలకు తగ్గే అవకాశం ఉంది. బెంగళూరు-ముంబై మార్గంలో నడిపేందుకు రెండు వందే భారత్ స్లీపర్ రైళ్లను సిద్ధం చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఒక్కో రైలులో 16 కోచ్లు ఉంటాయి. ఇప్పటికే ఈ రైళ్లకు అవసరమైన పరీక్షలు, తనిఖీలు నిర్వహించారు. ట్రయల్ రన్ తర్వాత సర్వీసులను ప్రారంభించే దిశగా అధికారులు ముందుకు వెళ్తున్నారు.
రైలు ఎంత వేగంగా ప్రయాణిస్తుంది? మొత్తం ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను ఖరారు చేసేందుకు త్వరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) ఆధ్వర్యంలో స్పీడ్ పరీక్షలు కూడా నిర్వహించే అవకాశం ఉంది. బెంగళూరులో ఈ రైలుకు KSR బెంగళూరు లేదంటే SMVT బెంగళూరు స్టేషన్లలో ఏదో ఒకదాన్ని ప్రారంభ స్టేషన్ గా ఎంపిక చేసే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. ఫైనల్ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. షెడ్యూల్, ప్రారంభ తేదీ వివరాలను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ రైలులో మొత్తం 16 కోచ్లు ఉంటాయి. ఇందులో 11 కోచ్లు 3AC, నాలుగు కోచ్లు 2AC, ఒక కోచ్ 1ACగా ఉండనున్నాయి. 3AC ప్రయాణానికి భోజనంతో కలిపి సుమారు రూ.3,000 వరకు ఛార్జీ ఉండొచ్చని అంచనా. అయితే అధికారిక టికెట్ ధరలు ఇంకా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం బెంగళూరు-ముంబై మధ్య ప్రయాణానికి ఉదయన్ ఎక్స్ ప్రెస్, SMVT బెంగళూరు-ఎల్టిటి ముంబై ఎక్స్ ప్రెస్ లాంటి రైళ్లు సుమారు 24 గంటలు తీసుకుంటున్నాయి. కొత్త స్లీపర్ వందే భారత్ మాత్రం ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించనుంది.
ప్రతిపాదిత రైలు మార్గం రాయచూర్, యాద్గిర్, కలబురగి లాంటి ప్రాంతాల మీదుగా సాగుతుంది. ఈ మార్గం సుమారు 1,137 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటికే ఈ రూట్ లో ఎలక్ట్రిఫికేషన్ పూర్తి అయ్యింది. చాలా ప్రాంతాల్లో డబుల్ ట్రాక్ ఉండటంతో గంటకు 130 కిలోమీటర్ల వరకు వేగంతో రైలును నడిపే అవకాశం ఉంది. ఈ రైళ్లను బెంగళూరులోని BEML సంస్థ తయారు చేసింది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పర్యవేక్షణలో వీటి తయారీ జరిగింది.
బెంగళూరు-ముంబై మధ్య వందే భారత్ స్లీపర్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు రాత్రిపూట సౌకర్యవంతమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా కర్ణాటకలోని రాయచూర్, యాద్గిర్, కలబురగి ప్రాంతాలకు వేగవంతమైన రైలు కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంది.
Read Also: ఇంత కాలం విమానాలు.. ఇప్పుడు రైళ్లు.. ఎతిహాద్ ప్లాన్ అదిరింది భయ్యా!