Air India International Flights: ఇంధన ధరలు నెమ్మదిగా తగ్గుముఖం పట్టడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని నెలలుగా నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను సెప్టెంబర్ 1 నుంచి తిరిగి ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. అంతేకాకుండా, కొన్ని అంతర్జాతీయ మార్గాల్లో అదనపు విమానాలను కూడా నడపాలని నిర్ణయించింది.
2026 జూన్ నుంచి ఆగస్టు వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం పడింది. కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతున్న గగనతల ఆంక్షలు, మరోవైపు భారీగా పెరిగిన జెట్ ఇంధన ధరల కారణంగా ఆయా విమాన సర్వీసులపై ఎఫెక్ట్ కొనసాగింది. ఎయిర్ ఇండియా ప్రతి వారం నడిపే కొన్ని విమానాల సంఖ్యను తగ్గించాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉత్తర అమెరికా, యూరప్, ఆగ్నేయాసియా, సార్క్ దేశాలు, ఫార్ ఈస్ట్ ప్రాంతాలకు వెళ్లే విమానాలపై పడింది. ప్రయాణికుల డిమాండ్ ఉన్నప్పటికీ, ఎక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇంధన ధరల కారణంగా విమాన సర్వీసులను తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రస్తుతం పరిస్థితులు కొంత మెరుగుపడటంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. జెట్ ఇంధన ధరలు కూడా తగ్గడంతో, నిలిపివేసిన విమానాలను దశలవారీగా తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతోంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ సంస్థ ఉద్యోగులకు పంపిన ఇంటర్నల్ మెమోలో ఇదే విషయాన్ని వెల్లడించినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించింది. మిడిల్ ఈస్ట్ క్రైసిస్ కు ముందు ఉన్న స్థాయితో పోలిస్తే ఇంధన ధరలు ఇప్పటికీ ఎక్కువగానే ఉన్నప్పటికీ, కాస్త తగ్గినట్లు ఆయన తెలిపారు. అందువల్ల పాత విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో పాటు, అవసరమైన మార్గాల్లో కొత్త సర్వీసులను కూడా నడపనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్లోనే కాకుండా అక్టోబర్ చివరి నుంచి ప్రారంభమయ్యే శీతాకాల ప్రయాణ సీజన్లో కూడా విమానాల సంఖ్యను పెంచాలని ఎయిర్ ఇండియా ప్రణాళిక రూపొందించింది. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే నగరాలకు అదనపు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. మిలన్, ఫ్రాంక్ఫర్ట్, జ్యూరిచ్, వియన్నా, మెల్బోర్న్, టోక్యో, న్యూయార్క్ నగరాలకు విమానాల సంఖ్యను పెంచే అవకాశం ఉంది. దీంతో పాటు ముంబై నుంచి టొరంటోకు కొత్త సీజనల్ విమాన సర్వీసును కూడా ప్రారంభించేందుకు ఎయిర్ ఇండియా సిద్ధమవుతోంది.
ఎయిర్ ఇండియా వారానికి 1,200కు పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. ఉత్తర అమెరికాకు వారానికి 33 విమానాలు, యూరప్కు 47, యూకేకు 57, ఆస్ట్రేలియాకు ఎనిమిది విమానాలు నడుస్తున్నాయి. ఫార్ ఈస్ట్, ఆగ్నేయాసియా, సార్క్ దేశాలకు కలిపి వారానికి 158 విమాన సర్వీసులు ఉన్నాయి. ఆఫ్రికాలోని మారిషస్కు ప్రతి వారం ఏడు విమానాలను ఎయిర్ ఇండియా నడుపుతోంది. ఇంధన ధరలు మరింత తగ్గితే రానున్న రోజుల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులకు మరిన్ని విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కొన్ని మార్గాల్లో ప్రయాణ సౌకర్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంది.
Read Also: ప్రకృతి అందాల నడుమ వందేభారత్ పరుగులు.. ట్రయల్ రన్ కు రైల్వే గ్రీన్ సిగ్నల్!