Russia-India Rail Corridor: రష్యా-భారత్ నడుమ రైలు మార్గం ఏర్పాటుకు సంబంధించిన వార్తలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తి కలగిస్తున్నాయి. రెండు దేశాల మధ్య రైల్వే మార్గం ఏర్పాటుపై చర్చ జరుగుతున్నప్పటికీ, పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. అంతేకాదు, ఇది ప్రయాణికుల కోసం నడిపే రైలు సర్వీసు కాదని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ప్రధానంగా సరుకు రవాణా, వాణిజ్యం, లాజిస్టిక్స్ ను సులభతరం చేయడంపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
రష్యాను భారత్ తో అనుసంధానించేందుకు అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ (INSTC) కీలకంగా మారుతోంది. ఈ మార్గం రష్యా నుంచి మధ్య ఆసియా దేశాలు, ఇరాన్ మీదుగా భారత్ కు అనుసంధానం కల్పించేలా రూపొందుతోంది. ప్రతిపాదిత మార్గంలో కజకిస్తాన్, తుర్క్ మెనిస్తాన్, ఇరాన్ లాంటి దేశాల మీదుగా రైలు మార్గాలు ఉపయోగించే అవకాశం ఉంది. రష్యా ఉప ప్రధాని మారత్ కూడా హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గాలను అభివృద్ధి చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. సముద్ర మార్గాల్లో ఎదురయ్యే కొన్ని భద్రతా, భౌగోళిక సమస్యలకు ప్రత్యామ్నాయ మార్గాలు అవసరమని ఆయన అభిప్రాయపడినట్లు రష్యా వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
రష్యా నుంచి భారత్కు ప్రతిపాదిత రైలు మార్గంలో ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుందో ప్రస్తుతం కచ్చితంగా చెప్పలేం. దీనికి సంబంధించిన అధికారిక ప్రయాణ సమయం ఇంకా నిర్ణయించలేదు. అయితే INSTC ద్వారా సరుకు రవాణాకు సంబంధించిన అంచనాలు కొంత అవగాహన ఇస్తున్నాయి. దాదాపు 7,200 కిలోమీటర్ల ఈ మల్టీమోడల్ కారిడార్లో రైలు, రోడ్డు, సముద్ర మార్గాలను కలిపి సరుకులను తరలిస్తారు. సంప్రదాయ సముద్ర మార్గంలో సుమారు 40 రోజులు పట్టే సరుకు రవాణాను ఈ మార్గం ద్వారా దాదాపు 20 నుంచి 25 రోజులకు తగ్గించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ భవిష్యత్తులో పూర్తిస్థాయి రైలు మార్గం ఏర్పడి, అన్ని వ్యవస్థలు సమర్థంగా పనిచేస్తే ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది.
ప్రస్తుతం రష్యా-భారత్ మధ్య నేరుగా ప్రయాణికుల రైలు సర్వీసు ప్రారంభించే ప్రణాళిక గురించి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టికెట్లు, టైమ్ టేబుల్, ప్యాసింజర్ సర్వీసులు లాంటి అంశాలపై కూడా స్పష్టత లేదు. ఈ మార్గంలో పలు దేశాలు ఉండటంతో వీసా నిబంధనలు, భద్రతా సమస్యలు, రైల్వే ట్రాక్ గేజ్ లలో తేడాలు, సరిహద్దు తనిఖీలు లాంటి అంశాలను పరిష్కరించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వివిధ దేశాల రైల్వే వ్యవస్థలను ఒకే ప్రయాణంలో సమన్వయం చేయడం కూడా పెద్ద సవాల్ కానుంది. అందువల్ల సాధారణ ప్రయాణికుడికి ప్రస్తుతం ఈ మార్గం అంత సులభం కాదు. భవిష్యత్తులో INSTC పూర్తిగా అభివృద్ధి చెంది, దేశాల మధ్య అనుసంధానం మెరుగుపడితే ప్రయాణికుల రైలు సేవలపై కూడా ఆలోచించే అవకాశం ఉంది.
Read Also: ఇంత కాలం విమానాలు.. ఇప్పుడు రైళ్లు.. ఎతిహాద్ ప్లాన్ అదిరింది భయ్యా!