Secunderabad- Kakinada Town Special Trains: వేసవి సెలవులు దగ్గర పడుతున్న నేపథ్యంలో సొంతూళ్లకు వెళ్లిన ప్రజలు తిరిగి హైదరాబాద్ బాటపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్లు ప్రయాణీకులతో రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. అందులో భాగంగానే సికింద్రాబాద్-కాకినాడ నడుమ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రైల్వే అధికారులు కీలక ప్రకటన చేశారు.
ప్రత్యేక రైళ్లు అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు?
తాజాగా సికింద్రాబాద్- కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ఈ రైళ్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నడుస్తాయి? రైల్వే షెడ్యూల్ వివరాలతో పాటు ఏ స్టేషన్లలో ఆగుతాయి? అనే విషయాలు వెల్లడించింది.
జూన్ 12 నుంచి ఆగష్టు 1 వరకు..
సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే రైళ్లు జూన్ 12 నుంచి ఆగష్టు 1 మధ్య అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. రైలు నెం-07041 (సికింద్రాబాద్-కాకినాడ టౌన్) జూన్ 12, 19, 26 తేదీలతో పాటు జూలై 3, 10, 17, 24, 31 తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి రాత్రి 10:40 గంటలకు బయలుదేరి ఉదయం 10:45 గంటలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. ఇక రైలు నెం-07042 (కాకినాడ టౌన్-సికింద్రాబాద్) కాకినాడ టౌన్ నుంచి సాయంత్రం 6:55 గంటలకు బయలుదేరి ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైలు జూన్ 13, 20, 27, జూలై 4, 11, 18, 25, ఆగస్టు 1 తేదీలలో అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే 10 రైళ్లు ఇవే!
ప్రత్యేక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్లు
సికింద్రాబాద్-కాకినాడ టౌన్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లు పలు రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. నల్లగొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లె, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో ఆగుతాయి. ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ఈ స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులు ఈ రైళ్లను ఉపయోగించుకుని ఇబ్బంది కలగకుండా ప్రయాణం చేయాలని సూచించారు. ఈ రైళ్లు హైదరాబాద్- కాకినాడ మధ్య ప్రయాణాలు చేసే ప్యాసింజర్లకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
Read Also: వందేభారత్ రైలులో జ్యూస్ తాగుతున్నారా? జాగ్రత్త, మీకు ఇలాంటి పరిస్థితి రావచ్చు!