పవిత్ర ప్రయాగరాజ్ లో నిర్వహిస్తున్న మహా కుంభమేళాను విజయవంతం చేసేందుకు ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇవాళ్టి నుంచి మొదలయ్యే కుంభమేళా వేడుకలు వచ్చే నెల 26 వరకు కొనసాగనున్నాయి. సుమారు 45 రోజుల పాటు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి పునీతులుకానున్నారు.
రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు
కుంభమేళా వేడుకల కోసం యూపీ ప్రభుత్వం ఏకంగా రూ.7,500 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నది. ఈ వేడుకల కోసం భారతీయ రైల్వే సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి ఏకంగా 13 వేల రైళ్లను మహా కుంభమేళా కోసం కేటాయించింది. మహా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించడానికి ప్రయాగరాజ్ రైల్వే డివిజన్ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే డివిజనల్ రైల్వే మేనేజర్ హిమాన్షు బడోని ‘చలో ప్రయాగ్ రాజ్ మహాకుంభ్ చలే’ అనే థీమ్ సాంగ్ను ఆవిష్కరించారు.
ప్రయాగరాజ్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా..
ప్రయాగరాజ్ గొప్పదనాన్ని చాటిచెప్పేలా ఈ థీమ్ సాంగ్ ను రూపొందించారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక సారాంశానికి తెలిపేలా ఈ పాటను రూపొందించారు. ఆషిత్, ఆరవ్ అనే సోదరులు ఈ పాటను పాడారు. ఈ పాట ప్రయాగరాజ్ పవిత్రను చాటి చెప్తున్నది. మహా కుంభమేళా ప్రత్యేకతను పూసగుచ్చినట్లుగా వివరిస్తున్నది. ఈ పాట విడుదల కార్యక్రమంలో సీనియర్ రైల్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. యువ గాయకుల ప్రతిభను డివిజనల్ రైల్వే మేనేజర్ హిమాన్షు బడోని ప్రశంసించారు. యువ సంగీతకారులు ఇప్పటికే ప్రతిష్టాత్మక వేదికలపై తమ నైపుణ్యాలను ప్రదర్శించారని అన్నారు. సింగర్ అషిత్ యూపీ సంగీత నాట్య అకాడమీ నిర్వహించిన శాస్త్రీయ సంగీత పోటీలో మొదటి స్థానం సాధించారని ఆయన వెల్లడించారు.
“ఈ థీమ్ సాంగ్ ప్రయాగరాజ్ అద్భుతమైన చరిత్ర, మహా కుంభమేళా గొప్పతనాన్ని చాటి చెప్పేలా ఉంది. రేపటి తరానికి ఓ అమూల్యమైన బహుమతిగా భావించవచ్చు. ఈ పాటను వినడం ద్వారా, దేశం, ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు ప్రయాగరాజ్ సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో కనెక్ట్ అవుతారు. ఈ పాట విశ్వాసం, భక్తి కలబోతగా చెప్పుకోవచ్చు. ప్రయాగ రాజ్ పవిత్రత, గంగా, యమున, సరస్వతి సంగమంతో ప్రతిధ్వనిస్తుంది. ఇది మహా కుంభమేళా వేడుక ఆత్మను ఆవిష్కరిస్తుంది. సందర్శకులకు ఆధ్యాత్మికత, విశ్వాసానికి సంబంధించిన ప్రత్యేకమైన అనుభవాన్ని అందిస్తుంది” అని బడోని వెల్లడించారు.
కుంభమేళాలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొనే అవకాశం..
ఇక ఈ వేడుక కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు సుమారు 45 కోట్ల మంది పాల్గొంటారని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ వేడుకల కోసం భారీ బడ్జెట్ కేటాయించి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది యోగీ ప్రభుత్వం. గత కొద్ది నెలలు గా ఈ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏకంగా 50 వేల మంది పోలీసులతో ఏడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఏఐ టెక్నాలజీతో కూడిని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు.
Read Also: మహా కుంభమేళాకు వెళ్లే ముందు ఇవి తెలుసుకోండి.. తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్లాలంటే?