BIG TV LIVE Originals: దేశ వ్యాప్తంగా ఉన్న పలు నగరాలకు మెట్రో వ్యవస్థలు విస్తరిస్తున్నాయి. ఇప్పటికే పలు నగరాల్లో మెట్రో సేవలు కొనసాగుతున్నాయి. మరికొన్ని నగరాల్లో కొత్త మెట్రోలకు ప్రణాళికలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ ఉన్నవాటిలో అతిపెద్ద పెద్ద మెట్రో రైల్వే వ్యవస్థ ఏది? వాటిలో హైదరాబాద్ మెట్రో రైలు ఏ స్థానంలో ఉంది? అనే పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
దేశంలో మెట్రో వ్యవస్థలు- వాటి స్థానం
⦿ చెన్నై మెట్రో: 7వ స్థానం
చెన్నై మెట్రో దేశంలో 7వ అతిపెద్ద మెట్రో వ్యవస్థ. ఇది మొత్తం 54.1 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 42 స్టేషన్లను కలిగి ఉంటుంది. మొత్తం 2 లైన్లు ఉన్నాయి. దేశంలో వేగవంతమైన రవాణా వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది.
⦿ అహ్మదాబాద్ మెట్రో: 6వ స్థానం
అహ్మదాబాద్ మెట్రో దేశంలో 6వ స్థానంలో ఉంది. ఈ రైల్వే వ్యవస్థ మొత్తం 58.6 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 39 స్టేషన్ల ద్వారా ప్రయాణీకులకు సేవలను అందిస్తుంది.
⦿ కోల్కతా మెట్రో: 5వ స్థానం
కోల్కతా మెట్రో ఐదవ అతిపెద్ద వ్యవస్థగా కొనసాగుతోంది. దేశంలో మొట్ట మొదటి మెట్రోగా గుర్తింపు తెచ్చుకుంది. 1984లో ప్రారంభమూంది. ప్రస్తుతం 59.3 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. మొత్తం 50 స్టేషన్లతో మూడు లైన్లను కలిగి ఉంది. 2027 నాటికి 130 కిలోమీటర్లకు విస్తరించే అవకాశం ఉంది. సంవత్సరానికి 25.6 కోట్ల మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణిస్తున్నారు.
⦿ ముంబై మెట్రో: 4వ స్థానం
దేశ ఆర్థిక రాజధానిగా గుర్తింపు తెచ్చుకున్న ముంబై మెట్రో నాలుగో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ మెట్రో మొత్తం 59.5 కిలో మీటర్లు విస్తరించి ఉంది. మొత్తం 51 స్టేషన్ల ద్వారా ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది.
⦿ హైదరాబాద్ మెట్రో: 3వ స్థానం
హైదరాబాద్ మెట్రో దేశంలో మూడో అతిపెద్ద మెట్రో వ్యవస్థ. ప్రస్తుతం 67.2 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 57 స్టేషన్లతో 3 లైన్లు ఉన్నాయి. 2025 నాటికి ఇది 69 కిలోమీటర్లకు విస్తరించింది. సంవత్సరానికి 17.8 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యంలో రూపొందిన మెట్రో ప్రాజెక్ట్.
⦿ బెంగళూరు నమ్మ మెట్రో: 2వ స్థానం
బెంగళూరు మెట్రో రెండో అతిపెద్ద మెట్రో వ్యవస్థ. 73.8 కిలోమీటర్లు విస్తరించి ఉంది. 66 స్టేషన్లను కలిగి ఉంది. 2026 నాటికి 175 కిలోమీటర్లకు విస్తరించే ప్రణాళిక ఉంది. సంవత్సరానికి 17.4 కోట్ల మంది ప్రయాణిస్తున్నారు.
⦿ ఢిల్లీ మెట్రో: 1వ స్థానం
ఢిల్లీ మెట్రో దేశంలో అతిపెద్ద మెట్రో వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం 393 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. 288 స్టేషన్లు ఉన్నాయి. ఢిల్లీతో పాటు NCRలోని గురుగ్రామ్, నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, బహదూర్గఢ్, బల్లభ్గఢ్లను ఈ మెట్రో కలుపుతుంది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య 73 లక్షలుగా ఉంది. సంవత్సరానికి 100 కోట్లకు పైగా ప్రయాణీకులు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
హెచ్చరిక: ఇది BIG TV LIVE ఒరిజినల్ కంటెంట్. దీన్ని కాపీ చేసినట్లయితే.. DMCA, కాపీ రైట్స్ చట్టాల ద్వారా చర్యలు తీసుకుంటాం.